కంటికి కనిపించని కరోనా మహమ్మారితో ప్రపంచం అంతా పోరాడుతోంది. వ్యాక్సిన్ వస్తే తప్ప వ్యాధిని కంట్రోల్ చేయలేని పరిస్థితి తయారైంది. కరోనాకు వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రపంచం మొత్తం ఎన్నో ప్రయోగాలు చేస్తుంది. అయితే కరోనా భయంతో మనుషులు ఈ మద్య చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లోని బలరామ్పూర్ జిల్లాలో ఈ అవమానకర ఘటన జరిగింది. ఓ ప్రభుత్వ కార్యాలయం వద్ద చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని కరోనా భయంతో చెత్త వాహనంలో తరలించారు. ఉత్తరప్రదేశ్లోని బలరామ్పూర్ జిల్లాలో మహ్మద్ అన్వర్ అనే 42 ఏండ్ల వ్యక్తి స్థానిక ప్రభుత్వ కార్యాలయం గేట్ వద్ద కుప్పకూలి చనిపోయాడు. అయితే చాలా సేపటి వరకు ఎవరూ ఆ మృతదేహం వద్దకు వెళ్లలేదు. సమీపంలో ఓ అంబులెన్స్ ఉన్నప్పటికీ అందులోని సిబ్బంది కూడా పట్టించుకోలేదు.
ఈ సంఘటన జరిగిన కొద్ది సేపు తర్వాత నలుగురు పోలీసులు ముగ్గురు మున్సిపల్ సిబ్బంది సహాయంతో ఆ మృతదేహాన్ని మున్సిపల్ చెత్త వాహనంలో తరలించారు. ఈ విషయం కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. అయితే ఈ విషయంపై స్పందించిన బలరామ్పూర్ ఎస్పీ ఆ పోలీసుల తీరును తప్పుపట్టారు. అవమానకరంగా మృతదేహాన్ని చెత్త వాహనంలో తరలించడాన్ని ఖండించారు. ఇలాంటి సంఘటనలు ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఒకవేళ అతను కరోనా వల్ల చనిపోయాడని అనుమానం ఉంటే పీపీఈ కిట్ ధరించి మరో వాహనంలో తరలిస్తే బాగుండేదని అన్నారు.
మరోవైపు ఆ మృతదేహంపట్ల అవమానకరంగా ప్రవర్తించిన నలుగురు పోలీసులు, ముగ్గురు మున్సిపల్ సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు. అయితే ఇలాంటి సంఘటనలు అక్కడే కాదు.. పలు చోట్ల జరిగాయి. కరోనా వైరస్ వ్యాపిస్తుందని కొంత మంది మానసికంగా బాధపడుతున్నార.. కరోనా పాజిటీవ్ వచ్చిన వారిపట్ల వివక్ష చూపించవొద్దని అంటున్నారు. ఈ మద్య దేశంలో ఇలాంటి దారుణ సంఘటనలు ఎన్నో వెలుగు లోకి వచ్చాయి.