కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ ఇది. ఎన్నో లక్షల మందిని పొట్టనపెట్టుకున్న అతి క్రూరమైన వైరస్ ఇది. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ను అంతం చేసేందుకు యావత్ ప్రపంచం ప్రయత్నిస్తుంది. లాక్ డౌన్ పెట్టింది అన్ని పెట్టింది కానీ దీని వ్యాప్తిని ఆపలేకపోతున్నాం.
కరోనాను మాయం చేస్తున్న డాక్టర్లు సైతం ఈ వ్యాధికి ఆహుతి అవుతున్నారు. ఇంకా అలాంటి ఈ వైరస్ ని అంతమొందించేందుకు ఆవుల్లో ఉత్పత్తయిన యాంటీబాడీలు దోహదపడగలవని అంటున్నారు శాస్త్రవేత్తలు. జన్యు మార్పిడి విధానంలో ఆవుల్లో తయారుచేసే ఈ యాంటీబాడీలను మానవుల్లో ప్రవేశపెడితే కరోనా నిర్మూలన సాధ్యమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అయితే సాధారణంగానే ఆవులను యాంటీబాడీ కర్మాగారాలుగా చెప్తుంటారు. మనుషులలో కంటే కూడా ఆవుల రక్తంలో ప్రతి మిల్లీలీటరుకు దాదాపు డబల్ యాంటీబాడీలు ఉంటాయి అని అంటున్నారు. అయితే తాజా పరిశోధనల్లో భాగంగా అమెరికాలోని సౌత్ డకోటాకు చెందిన సాబ్ బయోథెరపాటిక్స్ కంపెనీ శాస్త్రవేత్తలు కరోనా వైరస్పై ఉండే స్పైక్ ప్రొటీన్ను ఆవుల్లో ప్రవేశపెట్టారు. దీని వల్ల వాటిలో అధిక సంఖ్యలో శక్తివంతమైన పాలీక్లోనల్ యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి.
ఇంకా ఈ యాంటీ బాడీలు కరోనా వైరస్కు చెందిన అనేక భాగాలను గుర్తిస్తాయి. ఆ భాగాలను అతుక్కొని అంతం చేస్తాయి. ఇంకా ప్రస్తుతం చాలా కంపెనీలు కరోనాపై పోరాటానికి మోనోక్లోనల్ యాంటీబాడీలను తయారు చేస్తున్నాయి. ఇకపోతే ఒక్క ఆవు ఒక్క నెలలో ఉత్పత్తి చేసే యాంటీబాడీలతో కొన్ని వందల మంది కరోనా బాధితులకు చికిత్స అందించవచ్చునని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
మరో రెండు నెలల్లో పాలీక్లోనల్ యాంటీబాడీలపై క్లినికల్ ప్రయోగాలను ప్రారంభించనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. మరి ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి.