కరోనా వైరస్ ఉధృతంగా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో గత 90 రోజులుగా కోర్టులు మూతపడిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 15 నుంచి తెరుచుకోనున్నాయి. ఈ నెల 15 సోమవారం నుంచి జిల్లాలోని అన్ని కోర్టులు ప్రామాణిక నిర్వహణ పద్ధతిలో పని చేయాలని ఇటీవల హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 15 నుంచి 30 తారీఖు వరకు మొదటి విడత, జూలై 1 నుండి 15 వరకు రెండో విడత, జూలై 16 నుంచి ఆగస్టు 7వ తారీకు వరకు మూడో విడత, మరియు ఆగస్టు 8 నుంచి నాలుగో విడత గా విభజన చేసింది. మొదటి రెండు విడతల్లో 20 పాత కేసులను మాత్రమే విచారణ చేస్తారు. కోర్టు నిర్వహణకు హైకోర్టు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.
కోర్టులో మెయిన్ గేట్ మాత్రమే తెరిచి ఉంటుంది అక్కడ థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ ను చేయించుకుని, చేతులను శానిటైజర్ తో రబ్ చేసుకుని, రిజిస్టర్ లో పేరు నమోదు చేసుకుని కోర్టు ప్రాంగణం లోకి ప్రవేశించాల్సి ఉంటుంది. కాజ్ లిస్ట్ ప్రకారం ఒకరి తర్వాత మరొకరు కోర్టు హాలులో కి హాజరుకావాలి., వెయిటింగ్ హాల్ కింద సీనియర్ సివిల్ జడ్జి కోర్టు హాలును ఏర్పాటు చేస్తారు. అర్జెంటు కేసులు ఫైలింగ్ కి సబ్ కోర్ట్ హాల్ ఎదురుగా టేబుల్ పై ప్రతి కోర్టు కి ఒక ట్రే/బాక్స్ చొప్పున ఏర్పాటు చేస్తారు. ఏ కోర్టు కు సంబంధించిన కేసు ఫైల్ లను ఉదయం 12:30 గంటల లోపు వేయాలి. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో లోక్ అదాలత్ నిర్వహించడం సాధ్యంకాదని హైకోర్టు తేల్చి చెప్పింది.
ఎలాంటి ఎక్స్ పార్టీ ఆర్డర్లు, నాన్ బెయిలబుల్ వారెంట్లు, అడ్వాన్స్ ఆర్డర్లు జారి చేయబడవు. అలాగే ఏ కేసులో కూడా పార్టీ యొక్క వ్యక్తిగత హాజరు కోర్టు వారు చెబితే తప్ప రానవసరం లేదు, రెగ్యులర్ కాల్ వర్క్ లేదు, మిగిలిన కేసులు ఒక నెల రోజుల తర్వాత వాయిదా వేయబడతాయి. ఇది మొదటి విడత అయిపోయిన తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి రెండవ విడత కొనసాగుతుందని ఉత్తర్వుల్లో హైకోర్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా కోర్టుల నిర్వహణ సాధ్యం కాకపోవడంతో వివిధ రకాల కేసుల విచారణ ఆగిపోయింది. మరి కొద్దిరోజుల పాటు నిర్వహణ స్లోగా సాగుతుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.