కరోనా ప్రభావానికి సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. భారత్లో కరోనా వైరస్ కేసులు ప్రతిరోజు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 11,458 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇప్పటి వరకు ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 3,08,993కి చేరగా, మృతుల సంఖ్య 8,884కి చేరుకుంది. 1,45,779 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,54,330 మంది కోలుకున్నారు. అయితే ఇప్పుడు కరోనా తో మరో కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయని పరిశోదక బృందాలు తెలుపుతున్నాయి.
కోవిడ్ సోకిన వారిలో కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని నార్త్వెస్ట్రన్ యూనివర్సిటీ తన స్టడీలో పేర్కొన్నది. ఈ విషయాన్ని ఆ వర్సిటీ తన వెబ్సైట్లోనూ పోస్టు చేసింది. హాస్పిటల్లో చేరిన సగం మంది పేషెంట్లలో.. కోవిడ్19 వల్ల నరాల సంబంధిత లోపాలు తలెత్తినట్లు గుర్తించారు. తలనొప్పి, నలత, చురుకుదనం తగ్గడం, ఏకాగ్రత లోపించడం, వాసన, రుచి గుర్తించకపోవడం, గుండెపోటు, బలహీనత, వొళ్లు నొప్పులు లాంటి లక్షణాలను గుర్తించినట్లు ఆ స్టడీలో ప్కేన్నారు.
కోవిడ్19 వ్యాధి శరీరంలో చాలా వరకు అవయవాలపై ప్రభావం చూపుతుందని, ఊపిరితిత్తులు, కిడ్నీలు, గుండె, మెదడు లాంటి అవయవాలకు కూడా ఆక్సిజన్ అందని పరిస్థితి ఏర్పడుతుందని స్టడీలో తెలిపారు. రోగ నిరోధక శక్తిపై పని చేస్తుంది, కాబట్టి మెదడు, నరాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని కూడా ఈ అధ్యయనం తేల్చింది. జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడానికి ముందు.. సార్స్ సీఓవీ2 వైరస్ వల్ల నాడీ రుగ్మతలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నదని నార్త్వెస్ట్రన్ పరిశోధనా బృందం రచయిత ఇగర్ కోరాల్నిక్ తెలిపారు.