తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ లాక్ డౌన్ ఉన్నప్పుడు జనాలందరూ ఎంతలా భయపడుతూ జాగ్రత్తలు పాటించరో... ప్రస్తుతం అదే జనాలు లాక్ డౌన్ సడలింపు ఇచ్చిన తర్వాత కరోనా వైరస్ అంటే కాస్తయినా భయం చూపించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వెరసి ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇక ఈ మహమ్మారి వైరస్ ప్రస్తుతం తెలంగాణ జిల్లాలో రోజురోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ సడలింపు ఇవ్వక ముందు వరకు కేవలం 20 కంటే తక్కువగా నమోదైన కేసుల సంఖ్య... ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు 150కిపైగా కేసులు నమోదవుతున్నాయన్న విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ జిల్లాలోని ప్రజానీకానికి ప్రాణభయం పట్టుకుంది.
ఇక కొంతమంది నిర్లక్ష్యం కారణంగా ఎంతోమంది ఈ మహమ్మారి వైరస్ బారిన పడాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఒక కుటుంబం లో వైరస్ సోకింది. ఒకరికో ఇద్దరికో కాదు ఏకంగా ఒకే కుటుంబానికి చెందిన 19 మందికి ఈ మహమ్మారి వైరస్ సోకడం ఒక సంచలనం గా మారిపోయింది. కరోనా వైరస్ బారిన పడి మరణించిన ఓ మహిళ ద్వారా... ఈ మహమ్మారి వైరస్ విజృంభణ జరిగింది. సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘటన. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కు చెందిన ఓ మహిళ (55) అనారోగ్యం కారణంగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. ఈ నెల 9న కరోనా లక్షణాలతో మరణించింది సదరు మహిళ.
దీంతో సదరు మహిళ మృతదేహం నుంచి నమూనాలను సేకరించి పరీక్షించగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో సదరు మహిళ కుటుంబ సభ్యులు సన్నిహితంగా తిరిగిన వారిని గుర్తించి వారిని ఐసోలేషన్ లో ఉంచి వారి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించగా... 25 మందిలో 19 మందికి కరోనా వైరస్ వచ్చినట్లుగా తేలింది. దీంతో ఒక్కసారిగా అధికారులు షాక్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇక వారందరినీ సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. కరోనా సోకిన వారిలో పెద్ద వారితో పాటు చిన్న పిల్లలు మహిళలు కూడా ఉన్నారు. కాగా ఈ మహిళ అంత్యక్రియల్లో పాల్గొన్న 40 మందిని గుర్తించేందుకు అధికారులు చర్యలు కూడా చేపట్టారు. ఈ మహమ్మారి వైరస్ వెలుగులోకి వచ్చిన ప్రాంతాన్ని కూడా కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు అధికారులు.