దేశంలో ఇప్పుడు కరోనా మహమ్మారి వల్ల ఎన్ని ప్రమాదాలు.. ఇబ్బందులు.. ప్రాణాలు పోతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే కరోనా సోకిన వారిని ఐసోలేషన్ వార్డుకు పంపుతున్నారు. ఇక కరోనా వైరస్ వల్ల ఈ మద్య పోలీసులు కూడా చాలా కష్టాలు పడ్డారు. దొంగలను పట్టుకోవడానికి వెళ్తే వారికి కరోనా ఉండటం.. అది కాస్త వీరికి సోకడం జరిగింది. ఈ నేపథ్యంలో ఖైదీల విషయంలో పోలీసులు ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా తాత్కాలిక జైలు నుంచి ఇద్దరు అండర్ ట్రయల్ ఖైదీలు తప్పించుకు పారిపోయారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటుచేసుకుంది.
హర్షద్ సయీద్(20), ఆకాశ్ పవార్(26) అనే ఇద్దరు వ్యక్తులు ఐపీసీ సెక్షన్ 395(డెకాయిట్), సెక్షన్ 307(హత్యా ప్రయత్నం) కింద బుక్ అయ్యారు. ఈ ఖైదీలను మే 28వ తేదీన కోర్టులో హజరుపరచగా న్యాయస్థానం వీరిని జ్యూడిషియల్ కస్టడికి పంపింది. కరోనా వైరస్ ఇబ్బందుల వల్ల కొత్త ఖైదీలను పాత ఖైదీలతో కలవకుండా యరవాడ జైలు అధికారులు పూణె జిల్లా అధికార యంత్రాంగం సహాయంతో ఓ హాస్టల్ను తాత్కాలికంగా జైలుగా మార్చారు.
ఈ నేపథ్యంలో పక్కా ప్లాన్ తో టాయిలెట్ కిటికీని పగులగొట్టి ఇరువురు తప్పించుకు పారిపోయారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు జైలు సూపరింటెండెంట్ తెలిపారు. పరారైన వ్యక్తుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అయితే పారిపోయిన ఖైదీలకు కరోనా లక్షణాలు ఏమీ లేవని అన్నారు.