నవమాసాలు  మోసి... తన ఊపిరి తన బిడ్డకి  ఊపిరిగా అల్లి .. జన్మనిచ్చిన తల్లి ప్రేమ మించిన ప్రేమ ఈ సృష్టిలో లేదు అన్నది జగమెరిగిన సత్యం. కేవలం జన్మనివ్వడం కాదు ఆలనాపాలనా చూస్తూ ఎవరికీ సాధ్యం కాని రీతిలో తనలోని ప్రేమనంత గోరుముద్దల రూపంలో పెట్టి ప్రేమానురాగాలను పంచుతుంది కన్నతల్లి. అలాంటి కన్న తల్లి పేగు తెంచుకుని పుట్టిన తన కూతురు కళ్ళముందే చనిపోవడం తట్టుకోలేకపోయింది. కూతురు మరణవార్త తెలియగానే బోరున విలపిస్తూ ప్రాణాలు విడిచింది ఆ తల్లి . ఈ ఘటన ఎంతో మందిని కలిచి వేసింది. పేగు బంధాన్ని ఏకంగా మృత్యువు కూడా విడుదల చేయలేక పోయింది.

 

 వివరాల్లోకి వెళితే... పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి లో జరిగింది ఈ విషాద ఘటన. ఒకే ఇంట్లో గంట వ్యవధిలో ఏకంగా తల్లి కూతురు మరణించటం  ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. దేవరపల్లి గోపాలపురం రోడ్డు లో  దుబ్బాక బోర్డు కార్యాలయం సమీపంలో పూడి చలమయ్య కుమార్తె బల్లి సరిత ఇటీవల దేవరపల్లిలో పుట్టింటికి వచ్చింది. ఇటీవలే గురువారం గృహప్రవేశ కార్యక్రమం ఉండగా  కుటుంబ సభ్యులు  బంధువులతో ఆనందంగా గడిపింది. రాత్రి కూడా భోజనం అనంతరం బంధువులతో ఎంతో ఆనందంగా గడిపిన సరిత... శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో బాత్రూంకు వెళ్లి తిరిగి రాలేదు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబీకులు బాత్రూంకు వెళ్లి చూడగా అక్కడే  పడిపోయి ఉంది సరిత. 

 

 బాత్రూమ్ నుంచి బయటకు తీసుకురాగా సరిత అప్పటికే చనిపోయినట్లు  అప్పటికే చనిపోయినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. ఇక ఈ ఘటన చూసిన తల్లి గుండె పగిలిపోయింది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డలేని జీవితం   ఎందుకు అనుకుందో ఏమో... బోరున విలపిస్తూ ప్రాణాలు విడిచింది. గంట వ్యవధిలోనే ఒక ఇంట్లో తల్లి వరలక్ష్మి కూతురు సరిత  మృతి చెందడంతో కుటుంబం  విషాదంలో మునిగిపోయింది. ఇక  తల్లి కూతుర్ల మృతదేహాలకు పక్కపక్కనే ఉంచి  స్థానిక స్మశానవాటికలో అంత్యక్రియలు జరిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: