మాకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్న దక్షిణ కొరియాకు తప్పక బుద్ధి చెబుతామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ సోదరి కిమ్ యో జోంగ్ ఆదివారం హెచ్చరికలు జారీ చేసింది. దేశ అంతర్గత వ్యవహారాల్లో దక్షిణ కొరియా తలదూర్చుతోందని, అలర్లను, నిరసనలను పెంచేందుకు కుట్రలు చేస్తోందని ఆమె ఆరోపించారు. దక్షిణ కొరియాకు చెందిన నిరసనకారులు.. ఉత్తర కొరియాలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని, కిమ్ న్యూక్లియర్ విధానాలను తప్పుపడుతూ కొంతకాలంగా ఉత్తర కొరియా సరిహద్దు గ్రామాల్లోకి దక్షిణ కొరియా బెలూన్ల ద్వారా ప్రతులను పంపుతున్న విషయం వెలుగు చూసింది.
ఈ పరిణామాన్ని తీవ్రంగా తీసుకున్న ఉత్తర కొరియా నాటి నుంచే దక్షిణ కొరియాతో స్నేహ సంబంధాలను కొనసాగించలేమని తేల్చి చెప్పింది. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య అంతంత మాత్రంగా ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు ఇప్పుడు పూర్తిగా దెబ్బతిన్నాయి. రెండు దేశాల ప్రభుత్వ ప్రతినిధుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియాకు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ ఆదివారం హెచ్చరికలు చేయడంతో విషయం మరింత వేడెక్కిందనే చెప్పాలి. దక్షిణ కొరియా పద్ధతి మార్చుకోకుంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో తమ సైన్యానికి బాగా తెలుసని పేర్కొనడం గమనార్హం.
ఉత్తర కొరియాలో మానవ హక్కుల ఉల్లంఘణ జరుగుతోందని దక్షిణ కొరియాకు చెందిన మానవ హక్కుల నేతలు ఆరోపిస్తున్నారు. అక్కడి ప్రజలు బానిసలుగా బతుకుతున్నారని ఆరోపించారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై రకరకాల వదంతులు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. \ఆయన ఏప్రిల్ 15న తన తాత కిమ్ ఇల్ సుంగ్ పుట్టినరోజు వేడుకలకు హాజరు కాలేదు. అప్పటి నుంచి కిమ్ సోదరి ఉత్తర కొరియా పాలనలో రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారారు.
తండ్రి మరణం తర్వాత కేవలం పదిహేను రోజుల్లోనే పార్టీ అధ్యక్షుడిగా, దేశ సైన్యాధిపతిగా నియమితులైన కిమ్ పాలన సాగిస్తున్నాడు. తన నియంతృత్వ, దుందుండుకు స్వభావంతో అమెరికాను సైతం భయపెట్టిన విషయం తెలిసిందే.