ప్రపంచదేశాలను పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్.. ప్రస్తుతం ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోజురోజుకు కరోనా కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు దేశదేశాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. తగిన ఫలితం రావడం లేదు. అయితే ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈనెల 16 నుంచి నిర్వహించాలని కేబినెట్ సమావేశం తీర్మానించింది. 16వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సభ ప్రారంభంకానుంది.
తొలి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ హరిచందన్ ప్రసంగించనున్నారు. 18వ తేదీన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి వల్ల కేవలం మూడు రోజులు మాత్రమే సమావేశాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ సారి అసెంబ్లీ సమావేశాలకు మీడియా లైవ్ లేదు. ఈ మేరకు జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ఒకరకంగా చెప్పాలంటే చంద్రబాబుకు పెద్ద షాక్ అనే చెప్పాలి.
వాస్తవానికి ప్రతి అసెంబ్లీ సమావేశాల్లోనూ టీవీల్లో కనిపించటానికి తెగ హడావుడి చేసి.. జనం దృష్టిని ఆకర్షించేందుకు అధికార, ప్రతిపక్షాలు నానా పాట్లు పడుతుంటాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు అసెంబ్లీలో మైక్ పట్టుకుని ఎన్ని గంటలు మాట్లాడినా.. అధికార పక్షాన్ని ఎంత ఉతికి ఆరేసినా.. స్పీకర్ కోరుకుంటే తప్ప అది జనంలోకి వెళ్లదు. మీ దుర్మార్గాన్ని అసెంబ్లీ సాక్షిగా కడిగిపారేస్తా.. దాన్ని కోట్లాది మంది తెలుగు జనం చూడాలి అంటూ చంద్రబాబు ఎంత గొంతు చించుకున్నా.. జగన్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు.
లైవ్ ప్రెస్ మీట్లు గాకుండా కేవలం వీడియో సందేశాలకే పరిమితం అవ్వాలని జగన్ తీసుకున్న తాజా నిర్ణయంతో చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ప్రదర్శించే చాన్స్ లేకుండా పోయింది. ఇక మరోవైపు టీడీపీలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ముగ్గురు బయటకు వచ్చేశారు. అలాగే ఆ పార్టీ తరపున బలమైన వాయస్ వినిపించే అచ్చెన్నాయుడుని కూడా అరెస్ట్ చేశారు. దీంతో చంద్రబాబు వెనకుండి గట్టిగా మాట్లాడే నాయకులు కూడా లేకుండా పోయారు. ఇక అసెంబ్లీలో చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారు..? అన్నది జనానికి తెలియకుండా జగన్ స్కెచ్ వేయడంతో.. పెద్ద షాక్ తగిలింది. మరి ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఎంత వాడి వేడిగా సాగుతాయో చూడాలి.