ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అంత్యక్రియలు ముంబైలో ముగిశాయి. అభిమానుల అశ్రునయనాల మధ్య ఆయన అంతిమ సంస్కారాలు జరిగాయి. సుశాంత్ ఉరేసుకోవడం వల్లే చనిపోయాడని పోస్ట్మార్టం రిపోర్ట్ తేల్చినా.. కుటుంబ సభ్యుల అనుమానాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బాలీవుడ్ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఉరి వేసుకోవడం వల్ల ఊపిరాడక ఆయన మరణించినట్లు పోస్ట్మార్టం రిపోర్ట్లో తేలింది. తుది నిర్ణయం తీసుకోవడానికి కారణం గత ఆరు నెలలుగా మానసిక ఒత్తిడిలో ఉండటమేనని పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. అయితే ఆయన మరణంపై కుటుంబ సభ్యుల్లో అనుమాలు ఉండటంతో.. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సుశాంత్ ఫోన్ డేటాను పరిశీలిస్తున్నారు.
ఆదివారం ఉదయం ఉరి వేసుకోవడానికి ముందు సుశాంత్ తన ఫోన్ ద్వారా గర్ల్ఫ్రెండ్ రియా చక్రవర్తి, స్నేహితుడు మహేశ్ శెట్టితో మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని విచారించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పోలీసుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సుశాంత్ పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత రియా చక్రవర్తి కూపర్ ఆసుపత్రికి వెళ్లి, ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. సుశాంత్, రియా ప్రేమలో ఉన్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. 2020 నవంబరులో వీరి వివాహం జరగబోతోందని కూడా వార్తలు వచ్చాయి. రియా ఈ ఏడాది జనవరి 21న సుశాంత్కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆయనతో కలిసి తీసుకున్న ఫొటోల్ని షేర్ చేశారు.
సుశాంత్ మృతదేహం ఫొటోల్ని సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేయొద్దని మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మృతదేహం ఫొటోల్ని చాలా మంది సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారని, ఇది సముచితం కాదని తెలిపారు. మృతదేహం ఫొటోల ప్రసారం న్యాయస్థానాల మార్గదర్శకాలకు విరుద్ధమని, అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని పోలీసులు ట్వీట్ చేశారు. కూపర్ ఆస్పత్రిలో పోస్ట్ మార్టమ్ తర్వాత సుశాంత్ అంత్యక్రియలు ముంబై పవన్ హన్స్ క్రిమటోరియంలో జరిగాయి. సుశాంత్ అంతిమయాత్రలో అభిమానులు అశ్రునివాళులు అర్పించారు.