ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా టెస్టులు, చికిత్సల ధరలను ఫైనల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రైవేటులో పరీక్షలను అత్యధికంగా 2 వేల 200 రూపాయలకు మించి వసూలు చేయరాదని స్పష్టం చేసింది. దీంతో కొంత కాలంగా ప్రైవేటు చికిత్సలపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడినట్టైంది.

 

కరోనా  మహమ్మారికి ఇకపై ప్రైవేటులోనూ పూర్తి స్థాయిలో టెస్టులు, చికిత్సలను అందించవచ్చని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. ఇప్పటికే దీనిపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు మంత్రి ఈటల వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి.. టెస్టులు, చికిత్సల ధరలు నిర్ణయించారు. ఇతర రాష్ట్రాలతో  పోలిస్తే రాష్ట్రంలో ప్రైవేటు వ్యక్తులు కరోనా టెస్టులకు తక్కువ మొత్తంలో ఫీజులు నిర్ణయించామన్నారు. మహారాష్ట్రలో 2 వేల 250కి కరోనా పరీక్షలు నిర్వహిస్తుండగా.. రాష్ట్రంలో కేవలం 2 వేల 200కే పరీక్షలు చేయించనున్నట్టు ప్రకటించారు. 

 

కరోనా చికిత్సలకు సంబంధించిన ఫీజులపై సైతం సర్కారు నిర్ణయం తీసుకుంది. ప్రైవేటులో చికిత్సలను అనుమతించాలని గత కొంత కాలంగా వినతులు వెల్లువెత్తిన తరుణంలో.. ప్రభుత్వం రేట్లు ఫిక్స్ చేసింది. కరోనా సోకి సాధారణ ఐసోలేషన్ లో ఉన్నవారికి 4 వేల రూపాయల ఫీజు, ఐసీయూ గదిలో చికిత్స పొందుతున్న వారి నుంచి 7 వేల 500 రూపాయల ఫీజు, వెంటిలేటర్ పై ఉన్న వారి నుంచి రోజుకు 9000వేలను మించి వసూలు చేయరాదని స్పష్టం చేసింది. అయితే కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ లక్షణాలు లేకపోయినా అనవసరంగా ఆస్పత్రుల్లో ఉంచి చికిత్సలు అందిస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. ప్రజలు కరోనా చికిత్స పొందుతున్న సమయంలో ప్రైవేటులో ఫీజుల విషయంలో ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నారనిపిస్తే వెంటనే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చని ప్రకటించారు

 

ప్రైవేటులో చికిత్స పొందాలని ఆసక్తి ఉన్నవారిని దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతి ఇచ్చామన్న ఈటెల..... ప్రభుత్వంలో కరోనా చికిత్స ల విషయంలో ఏ మాత్రం నాణ్యతా లోపాలు లేకుండా చూసుకుంటున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోరనా మహమ్మారి చికిత్సలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: