కరోనా వచ్చిన జర్నలిస్టులను కొంత వరకైనా ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చర్యలు చేపట్టింది. హైదరాబాద్ లో కొత్తగా మరో 25 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చినందున ఆ 25 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 20 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. అలాగే హోం క్వారైంటైన్ లో ఉన్న జర్నలిస్టులకు పది వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది తెలంగాణ మీడియా అకాడమీ.

 

 

ఇలా జర్నలిస్టులకు మొత్తం 5 లక్షల పది వేల ఆర్థిక సహాయం తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ ప్రకటించారు. ఆయా పాత్రికేయుల బ్యాంకు ఖాతాల్లో ఈ సొమ్ము జమ చేశారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ పాజిటీవ్ లు వచ్చిన 56 మంది జర్నలిస్టులకు 20 వేల రూపాయల చొప్పున 11 లక్షల ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశామని అల్లం నారాయణ తెలిపారు. అదే విధంగా హోంక్వారైంటైన్ లో ఉన్న 14 మంది జర్నలిస్టులకు 10 వేల రూపాయల చొప్పున ఒక లక్ష 40 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు.

 

 

ఇప్పటి వరకు మొత్తం 12 లక్షల అరవై వేల రూపాయలను అకాడమీ నిధుల నుండి అందించామని అల్లం నారాయణ తెలిపారు. కరోనా బారిన పడిన పాజిటివ్, క్వారంటైన్ జర్నలిస్టులు ప్రభుత్వ డాక్టర్లు ధ్రువీకరించిన మెడికల్ రిపోర్టులు అకాడమీ కార్యాలయంలో పంపించాలని సూచించారు. జర్నలిస్టులకు తక్షణ సహాయం కింద 20,000 రూపాయలు, క్వారన్ టైన్ లో ఉన్న జర్నలిస్ట్ లకు 10,000 రూపాయలు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ నుండి అందిస్తున్నామని తెలిపారు.

 

 

జర్నలిస్ట్ మిత్రులు తమ వివరాలను తెలంగాణ రాష్ట్ర మీడియా చైర్మన్ వాట్సప్ (8096677444) నెంబర్ కి పంపాలి. మరిన్ని వివరాలకు మీడియా అకాడమీ మేనేజర్ సెల్ నెంబర్ 9676647807 ని సంప్రదించవచ్చు. అయితే దీని కంటే కరోనా సోకిన జర్నలిస్టులకు రూ. 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: