కరోనా రోగులకు వైద్య సేవలు అందించేందుకు ‘తెలంగాణ ఇ నిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (టిమ్స్)’ సిద్ధమవుతోంది. ఈ వైద్యశాలను ఈ నెల 25న ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో కొత్తగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ ఇ నిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (టిమ్స్)’లో 499 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఏడాది కాలపరిమితి కోసం ఈపోస్టులను భర్తీ చేస్తున్నామని, అంతకుముందే కరోనా తీవ్రత తగ్గితే అప్పటితోనే ఈ పోస్టుల కాల పరిమితి ముగుస్తుందని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్లో పేర్కొంది.
ప్రస్తుతం హెచ్ఆర్ సిబ్బంది నియామకం జరుగుతోంది. అది పూర్తయిన వెంటనే ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ ఏర్పాట్లలో భాగంగా కొవిడ్ ఆసుపత్రి అనే బోర్డును తొలగించి టిమ్స్ బోర్డును పెట్టారు వైద్య సిబ్బంది. ఎయిమ్స్, నిమ్స్ తరహాలో స్వయం ప్రతిపత్తి కలిగిన సూపర్ స్పెషాలిటీ ఇన్స్టిట్యూట్గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావించినా ప్రస్తుతానికి జనరల్ ఆసుపత్రిగా పనిచేయించాలనుకుంటోంది. ఇప్పటికే డాక్టర్లు, నర్సుల డిప్యూటేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇక కొత్తగా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో 2,167 నర్సుల నియామక ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది. వారం రోజుల్లో దీన్ని కూడా పూర్తిచేసి పేషంట్లకు సేవలను ప్రారంభించాలనుకుంటున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు.
మంగళవారం నుంచి ఈనెల 19న సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మొత్తం పోస్టుల్లో.. ప్రొఫెసర్లు (14), అసోసియేట్ ప్రొఫెసర్లు (24), సీఏఎస్ఆర్ఎంవో(8), మెడికల్ ఆఫీసర్లు (121),అసిస్టెంట్ ప్రొఫెసర్లు (48), నర్సింగ్ సూపరింటెండెంట్ (1), హెడ్ నర్స్ (20), స్టాఫ్ నర్స్ (246), ఫార్మసీ సూపర్ వైజర్లు (2), ఫార్మసిస్టులు (12), డైటీషియన్, బయో మెడికల్ ఇంజనీర్, మెడికల్ రికార్డ్ ఆఫీసర్ పోస్టులను రిక్రూట్మెంట్ జరగనుంది. ఇదిలా ఉండగా హైదరాబాద్లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్లో నిత్యం ఇక్కడకు 150కేసులకు పైగానే నమోదవూతూ వస్తుండటం గమనార్హం. ఇక హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న నాలుగైదు జిల్లాల్లోనూ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది.