పల్లెలే ప్రగతికి పట్టుకొమ్మలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంగళవారం ప్రగతిభవన్లో ఆయా జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో గ్రామీణాభివృద్ధిపై దిశానిర్దేశం చేశారు. గ్రామాభివృద్ధి ప్రణాళిక, ఉపాధి హామీ పథకం, హరితహారం కింద అడవుల పునరుద్ధరణ, పల్లె ప్రగతిలోభాగంగా గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత, రైతుబంధు, రైతువేదికల నిర్మాణం, ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ ల ఏర్పాటు, కరోనాతో పాటు అంటువ్యాధులు, మిడతల దండు, నకిలీ విత్తనాలు, కరెంటు బిల్లుల చెల్లింపు తదితర అంశాలపై కలెక్టర్ల సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. వివిధ జిల్లాల కలెక్టర్లు, సీనియర్ అధికారులు తమ అభిప్రాయాలు చెప్పారు.
ఈ సందర్భంగా వివిధ అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు మార్గదర్శకం చేశారు. ఈసందర్భంగా ఆయన చెప్పిన మాటలు సీఎం మాటల్లోనే గ్రామ పంచాయతీలు ఖచ్చితంగా చార్టెడ్ అకౌంట్ నిర్వహించాలి. అప్పులు క్రమం తప్పకుండా చెల్లించాలి. ట్రాక్టర్ల లోన్ రీ పేమెంట్ చేయాలి. కరెంటు బిల్లులు ప్రతీ నెలా తప్పక చెల్లించాలి. 10 శాతం నిధులు హరితహారానికి కేటాయించాలి. గ్రామ వికాసం కోసం జరిగే చర్యల్లో విస్తృత ప్రజా భాగస్వామ్యం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేసింది. గ్రామాల్లో నాలుగు రకాల స్టాండింగ్ కమిటీలున్నాయి. వర్స్క్ కమిటీ, శానిటేషన్ కమిటీ, స్ర్టీట్ లైట్ కమిటీ, గ్రీన్ కవర్ కమిటీలలో 15 మంది చొప్పున సభ్యులున్నారు.
మొత్తం 8,20,727 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులున్నారు. స్టాండింగ్ కమిటీల సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలి. వీరంతా కలిస్తే ఓ సైన్యం. వీరిని క్రియాశీలం చేస్తే పల్లెల అభివృద్ధి ఉద్యమంలా సాగుతుంది. ప్రజలతో ఎన్నికైన 1,32,973 మంది గ్రామీణ ప్రాంత ప్రజాప్రతినిధులున్నారు. 32 మంది జడ్పీ చైర్మన్లు, 539 మంది ఎంపిపిలు, 539 మంది జడ్పీటిసిలు, 5,758 మంది ఎంపిటిసిలు, 12,751 మంది సర్పంచులు, 1,13,354 మంది వార్డు సభ్యులున్నారు. వీరందరినీ భాగస్వాములను చేస్తూ తెలంగాణ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి.