ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజు వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఎంపీ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీ లో సంచలనంగా మారాయి. ఎంపీ రాజకీయ భవిష్యత్తు మరో పార్టీలో ఊహించుకుని ఇపుడు విమర్శలు చేస్తున్నారు అంటూ వైసీపీ నేతలు ఆయన టార్గెట్ గా విమర్శలు చేస్తూ వస్తున్నారు. కొద్ది రోజులుగా ఎంపీ రఘు పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో విమర్శలు చేస్తూ వచ్చారు. ఎంతో ఓపిక పట్టిన అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలతోనే ఆయనకు కౌంటర్లు ఇప్పించింది. అయితే దీనిపై మళ్లీ ఆయన కౌంటర్లు వేసి తాను ఎంత మాత్రం తగ్గే ప్రశక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతుంది. ఎంపీ గారికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో కలిసే అవకాశం దొరికింది అని దీనికి సంబంధించి అమిత్ షా ఆయనకు సమయం కూడా ఇచ్చారు అని అంటున్నారు. ఆయన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అమిత్ షా తో భేటి అవుతారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు ఈ వార్త మాత్రం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఓ సీఎంకు దొరకని అమిత్ షా అపాయింట్ మెంట్... అదే పార్టీకి చెందిన ఎంపీకి దొరకడంతో వైసీపీ శ్రేణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
రాజకీయంగా వైసీపీ ఇప్పుడు బలంగానే ఉంది. కాని ఎంపీ వ్యవహార శైలి సీఎం జగన్ కి చాలా వరకు ఇబ్బందిగా మారింది. సిఎం జగన్ ఆయనను కట్టడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నా సరే ఎంపీ గారు ఆగడం లేదు. ఇదే టైంలో అమిత్ షా ని కలుస్తున్నారు అనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఏతావాతా వినిపిస్తోందేంటంటే రఘురామ వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తే వెంటనే బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉన్నారట. బీజేపీ కూడా ఇందుకోసం కాచుకుని కూర్చుని ఉందంటున్నారు.