ఏపీలో అధికార వైసీపీలో నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజు వ్యవహారం హాట్ హాట్గా మారుతోంది. కొద్ది రోజులుగా పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ముందుగా ముదునూరి ప్రసాద రాజు రఘు వ్యాఖ్యలను కౌంటర్ చేయగా అందుకు బదులుగా ఆయన కూడా ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇక మంగళవారం అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే నరసాపురం లోక్సభ నియోజకవర్గ పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పేర్ని నాని కూడా ఆయనపై విమర్శలు చేశారు. దీంతో ఆయన మళ్లీ వీళ్లందరిని పందులతో పోలుస్తూ ఓ వీడియో రిలీజ్ చేయడంతో పాటు సాయత్రం ఓ ఛానెల్ లైవ్లోకి వచ్చారు.
ఈ చర్చలో ఎంపీ రఘుతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు సైతం పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణకు ఎంపీ రఘుకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎంపీ గత రెండు మూడు రోజులుగా మాట్లాడుతున్న మాటలను చూసే తాను స్పందించాల్సి వచ్చిందని కొట్టు అన్నారు. తనపై చేసిన ఇసుక ఆరోపణలను ఆయన నిరూపించాలని.. అప్పుడు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన సవాల్ చేశారు. లేకపోతే నీ ఎంపీ పదవికి రాజీనామా చేస్తావా ? అని కొట్టు ప్రశ్నించారు.
నాయకుడికి గౌరవం ఇవ్వాలని.. నువ్వు కూడా బ్యాంక్ స్కామ్లో ఉన్నావని కొట్టు అనగా ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా కోపంతో ఊగిపోయారు. పిచ్చి.. నా కొ.. అంటూ ఎమ్మెల్యే తీరుపై మండిపడ్డారు.. ఇద్దిరి మధ్య మాటల యుద్ధం జరిగింది. లైవ్లోనే ఇద్దరూ బండబూతులు తిట్టుకున్నారు. ఇద్దరిలో ఎవ్వరూ వెనక్కు తగ్గలేదు.