కన్న వారిని ప్రేమించాలంటేనే సాధ్యపడని ఈ రోజుల్లో, ముక్కు ముఖం తెలియని ప్రజలకోసం, అయిన వారిని వదిలేసి, దేశం కోసం, దేశంలోని ప్రజల కోసం వారి ప్రాణాలను అడ్డేసి పహార కాస్తున్న సైనికుల ఋణం ఎంత చేసిన తీరదు.. ఏదో ఒక యుద్ధం జరిగి అందులో ప్రాణాలు కోల్పోతే గాని మనకు సైనికుడు గుర్తుకు రాడు.. కానీ వారు మాత్రం నిత్యం భారత ప్రజలు కంటినిండా నిదురించాలని, సరిహద్దుల వెంట శత్రువులు చొరబడకుండా అహర్నిశలు అప్రమత్తమై కాపలా కాస్తున్న కనిపించే దేవుళ్లూ.. వీరిలో ఎలాంటి స్వార్ధం ఉండదు..
కేవలం మాతృభూమి మీద మమకారంతో ప్రాణాలను సైతం లెక్కచేయక సైన్యంలో చేరిన వీరులు వీరు.. దేశరక్షణే ధ్యేయంగా, కన్నభూమిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ కుటుంబాలకు దూరంగా విధులు నిర్వర్తిస్తున్న వీరిని శత్రుబలగాలు దొంగ దెబ్బ కొట్టాయి.. కాగా ఈ దాడిలో వీరమరణం పొందిన 20 మంది భారత సైనికుల గురించి తెలుసుకుంటే వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో కదిలించే గాథ.. వీరి కుటుంబాలు పడుతున్న వ్యథ వర్ణనాతీతం.. వారి త్యాగాల వెనుక దాగిన విషయాలు తెలిస్తే కన్నీరు పెట్టని కళ్లు ఉండవు..
ఇకపోతే శత్రు సైనికుల చేతిలో అసువులు బాసిన ఝార్ఖండ్కు చెందిన కుందన్ కుమార్ ఓఝా(20) అనే యువకుడు రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి.. ఇతను 2011లో సైన్యంలో చేరాడు. అతడికి మొదట్నుంచి సైన్యంలో చేరాలన్న కోరిక ఉండటం వల్ల ఎంతగానో శ్రమించి సైనికుడిగా మారాడు.. కాగా ఏడాదిన్నర క్రితమే పెళ్లి అయిన ఇతనికి . 17 రోజుల కిందట పండంటి పాప పుట్టింది. ఆ శుభవార్త విన్న తండ్రి గుండె ఆనందంతో ఉప్పొంగింది. ‘లద్దాఖ్లో ఉన్నానమ్మా.. సెలవు దొరకగానే పాపను చూడ్డానికి వస్తాను’ అని ఫోన్లో మాటిచ్చాడు. తన కుటుంబంతో అవే అతడి ఆఖరు మాటలు. చివరికి కన్నకూతురి ముఖం కూడా చూడకుండానే అమరుడైయ్యాడు..
ఇక ఒడిశాలోని గిరిజన గూడల్లో పుట్టిన ఇద్దరు గిరిపుత్రులు సైనికులుగా దేశం కోసం సేవలందించే స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచారు. ఇప్పుడు విధి నిర్వహణలో ప్రాణాలర్పించి యావత్దేశానికి గర్వకారణంగా నిలిచారు. వారే చంద్రకాంత ప్రదాన్, సోరెన్... బియర్పంగ గ్రామానికి చెందిన చంద్రకాంత (28) ఓ దిగువ మధ్య తరగతి రైతు కుటుంబంలో పుట్టాడు. 2014లో సైన్యంలో చేరాడు. తల్లిదండ్రులు, ఇద్దరు తమ్ముళ్లు, ఒక అక్క ఉన్న కుటుంబానికి అతడి ఉద్యోగమే ఏకైక ఆధారం. ఇంకా పెళ్లి కూడా కాలేదు. ఇక చంపవుడ గ్రామానికి చెందిన సోరెన్ది (43) కూడా ఇలాంటి దీనగాథే. 1997లో సైన్యంలో చేరిన అతడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తండ్రి ఎప్పుడు సెలవుల్లో ఇంటికి వస్తాడా అని ఆశగా ఎదురుచూసిన ఆ పిల్లలు ఇప్పుడు సోరెన్ భౌతిక కాయం కోసం దిగాలుగా ఎదురుచూస్తున్నారు.
మరో సైనికుడు అయిన గణేష్ రాం కుంజన్ (27).. ఛత్తీస్గఢ్కు చెందిన ఇతను మాతృదేశం మీద ప్రేమతో 2017లో సైన్యంలో చేరాడు. వచ్చే ఏడాది ఇతని పెళ్లి చేయాలని నిర్ణయించుకోగా ఇప్పుడు మాతృదేశ రక్షణ కోసమే ప్రాణాలర్పించాడు. పశ్చిమ బెంగాల్కు చెందిన రాజేష్ ఒరాంగ్ అనే సైనికుడు 2015లో సైన్యంలో చేరాడు.. రెండు పదుల వయసులోనే దేశం కోసం అమరుడయ్యాడు.. కొన్ని నెలల క్రితం అతడు ఇంటికి వచ్చినప్పుడు పెళ్లి గురించి మాట్లాడుకున్నాం. ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని రాజేష్ సోదరి గద్గద స్వరంతో చెప్పింది.
ఇక దేశసేవకే అంకితమైన కుటుంబంలో పుట్టిన హిమాచల్ ప్రదేశ్లోని కరోహ్టా గ్రామానికి చెందిన అంకుష్ ఠాకూర్.. ఇతని తాత, తండ్రి సైన్యంలో పనిచేశారు. వారి స్ఫూర్తితో అంకుష్ కూడా 2018లో సైన్యంలో చేరాడు. విధి నిర్వహణలో భాగంగా 20 ఏళ్ల ప్రాయంలోనే వీరమరణం పొందాడు.. ఇలా హృదయాన్ని కదిలించే సన్నివేశాలు, మాటలకందని కడుపుతీపి గోసలు ప్రతి సైనికుడి ఇంటి గడపలో ఉన్నాయి.. అయినా అవేవి పట్టించుకోకుండా దేశం కోసం ఎంత హాయిగా ప్రాణాలు అర్పిస్తున్నారు.. వీరి త్యాగానికి ఏమిచ్చినా తక్కువే..