దేశంలో కరోనా కొత్త కోణాలలో సోకుతుంది. అయితే కరోనా సోకిన వ్యక్తిలో లక్షణాలు కనిపిస్తున్నా లేకపోయినా అతడితో కలిసి ఉండే వారికి వైరస్ తొందరగా వ్యాప్తి చెందుతుందని ‘ది లాన్సెట్ ఇన్ ఫెక్షస్ డిసీస్ జర్నల్ తెలిపింది. అయితే కుటుంబాలలో లక్షణాలు లేకుండానే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువని తెలిపారు. ఇంట్లో వారు లక్షణాలు లేకుండానే వ్యాధి బారిన పడిపోతారన్నారు. ఆ తర్వాత అనారోగ్యం పాలవుతారని వెల్లడించినట్లు తెలిపారు.
అయితే 60 సంవత్సరాలు పైబడినవారు ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఎక్కువని తెలిపారు. చైనా, గాంగ్ఝౌ నగరంలోని 13మిలియన్ల జనాభాలోని 349 మంది కరోనా వైరస్ రోగులు, వారితో చనువుగా మెలిగిన 1,964 మందిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. కేవలం కుటుంబసభ్యుల్నే కాకుండా పనివాళ్లను, స్నేహితులను కలిసి ప్రయాణం చేసేవారిపై పరిశోధనలు చేశారన్నారు.
కుటుంబాలలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి సరైన సమయంలో వైరస్ బాధితులను గుర్తించారు. వారితో సన్నిహితంగా మెలిగినవారిని కూడా క్వారంటైన్ చేయటం ఒక్కటే మర్గామని వారు తెలిపారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండే ఇంక్యూబేషన్ సమయంలో లక్షణాలు కలిగిన వారిని క్వారంటైన్ చేయటం ద్వారా వ్యాప్తిని అడ్డుకోవచ్చని అభిప్రాయపడ్డారు.
దీనిపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, హైదరాబాద్.. ప్రొఫెసర్ డా. వీ రమణ ధార మాట్లాడుతూ.. వైరస్ వ్యాప్తి చెందడానికి కుటుంబాలలో ఎక్కువ అవకాశం ఉంటుందన్నారు. అయితే నోటి తుంపరల ద్వారా గాల్లో చేరే వైరస్ ఇతరులకు తొందరగా వ్యాప్తి చెందుతుందన్నారు.
ఇంక్యూబేషన్ పీరియడ్లో వైరస్ వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉందన్నారు. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. మాస్కులు ఎల్లవేళలా ధరించాలన్నారు. చాలా మంది ఇంటికి రాగానే మాస్కులు తీసేస్తున్నారు. ఎందుకంటే ఇంట్లో ఉంటే రక్షణగా ఉన్నామని అనుకుంటారు. కానీ, భారతదేశంలోని ఇళ్లలో రోగాలు సోకే అవకాశం ఎక్కువ అని తెలిపారు.