తెలంగాణలో కరోనా కలకలం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతుండటంతో ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. జూన్ -22 నుంచి జూలై-04 వరకు ప్రభుత్వ ఆఫీసుల్లో 50 శాతం ఉద్యోగులతోనే కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఆదేశాలు తప్పక అనుసరించాల్సిన పరిస్థితి ప్రస్తుత పరిస్థితుల్లో తెరమీదకు వచ్చింది.
సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వర్తించేలా ప్రత్యేక మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. 50 శాతం ఉద్యోగులు ఒక రోజు ఆఫీసుకు వస్తే, మిగతా 50 శాతం ఉద్యోగులు మరో రోజు వచ్చే వెసులుబాటు కల్పించింది. నాలుగో తరగతి సిబ్బంది, క్లర్క్స్, సర్క్యులేట్ ఆఫీసర్స్కు రోజు విడిచి రోజు డ్యూటీలు అధికారులు ప్రత్యేక చాంబర్లో విధులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్ అధికారులు, అసిస్టెంట్ సెక్షన్ అధికారులు సహా...ఉద్యోగులంతా అందుబాటులో ఉండాలని చెప్పింది. అధికారులు, సిబ్బందికి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే ఇంటే వద్దే ఉండాలని, ప్రతిరోజు ఆఫీసు పరిసరాల్లో శానిటైజ్ చేయాలని సూచించింది. అలాగే ఆఫీసుల్లో ఉద్యోగులు ఏసీలు వాడకుండా ఉంటే మంచిదని వెల్లడించింది.
కాగా, గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. కేసులు అధికంగా వస్తున్న గ్రేటర్తో పాటు నగర శివారు ప్రాంతాలైన మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ లో టెస్టులు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ.. సెకండరీ కాంటాక్ట్స్ కు టెస్టులు చేస్తున్నారు.
మరోవైపు కరోనాతో అతలాకుతలం అవుతున్న సమయంలో భారత దిగ్గజ ఫార్మా కంపెనీ గ్లెన్మార్క్ కరోనా చికిత్సకు ఉపయోగపడే ఔషధాన్ని విడుదల చేసింది. ఫవిపిరవిర్, ఉమిఫెనోవిర్ అనే రెండు యాంటీ వైరస్ డ్రగ్స్పై గ్లెన్మార్క్ స్టడీ చేసింది. ఫవిపిరవిర్ను కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్నవారికి చికిత్స విధానంలో ఓరల్ డ్రగ్గా వినియోగించవచ్చని తేల్చింది. దీనిపై మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. కాగా, ఫాబిఫ్లూ పేరిట ఈ ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు ఇండియన్ డ్రగ్స్ రెగ్యులరేటర్ (భారత ఔషధ నియంత్రణ సంస్థ) నుంచి అనుమతి కూడా లభించిందని పేర్కొంది.