మూర్ఖపు ఎత్తుగడలతో ముందుకు సాగుతున్న చైనా దుశ్చర్యల కారణంగా గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగి భారత్కు చెందిన కల్నల్ స్థాయి అధికారితోపాటు 20 మంది సైనికులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఫలితంగా రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఎపిసోడ్లో చైనాపై ప్రపంచవ్యాప్తంగా అసహనం వ్యక్తం అవుతోంది. భారత్, చైనా మధ్య సైనిక ఉద్రిక్తతలను తగ్గించడానికి రష్యా తెరవెనుక ప్రయత్నాలను ప్రారంభించింది. ఇందులోభాగంగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిలతో కూడిన త్రైపాక్షిక చర్యలను రష్యా ప్రారంభించింది. అయితే, కేవలం ఉద్రిక్తతలు తగ్గించడమే కాకుండా దీని వెనుక పెద్ద ఎత్తుగడే ఉందంటున్నారు.
భారత, చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగడం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్పై భారీ ప్రతికూల ప్రభావాన్ని చూపడమే కాకుండా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్) సమూహం కింద అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థల పెరుగుదలపై కూడా ప్రభావం చూపుతుందని స్పష్టమయింది. చైనా-ఇండియా సరిహద్దు నుంచి వచ్చిన నివేదికలు “చాలా భయంకరమైనవి” అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సెక్రటరీ డిమిత్రి పెస్కోవ్ ప్రకటించడం దీనికి నిదర్శనం. ఈ నేపథ్యంలోనే రష్యా రంగంలోకి దిగింది. ప్రస్తుత ఘర్షణ ఇకముందు కూడా కొనసాగకుండా ఉండేందుకు రష్యా తన ప్రయత్నాలను మొదలుపెట్టింది. రష్యా దౌత్యక్రియాశీలత చర్చలు మూడు రోజుల క్రితం ప్రారంభమయ్యాయి. భారత్, చైనాలతో పాటు రష్యా ఉప విదేశాంగ మంత్రి ఇగోర్ మోర్గులోవ్ ప్రాంతీయ భద్రత గురించి చర్చించారు. రెండు హిమాలయ పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతలను ముందస్తుగా పరిష్కరించడంలో మాస్కోకు ప్రపంచ స్థాయిలో ఎక్కువ వాటా ఉన్నదని రష్యా దౌత్య వర్గాలు వెల్లడించాయి.
భారత్, చైనా మధ్య కొనసాగుతున్న సరిహద్దు ఘర్షణల కారణంగా ముగ్గురు విదేశాంగ మంత్రుల సమావేశం వాయిదా పడుతోందన్న ఊహాగానాల మధ్య రష్యా ఇండియా, చైనా (ఆర్ఐసీ) గ్రూపు ప్రాముఖ్యతను రష్యా పక్షం గుర్తించింది. "ఆర్ఐసీ యొక్క ఉనికి ఒక తిరుగులేని వాస్తవికత, ఇది ప్రపంచపటంలో దృఢంగా స్థిరపడింది. ద్వైపాక్షిక సహకారం యొక్క ప్రస్తుత దశ విషయానికొస్తే, అది స్తంభింపజేసే సూచనలు లేవు ”అని భారత్లో రష్యా రాయబారి నికోలాయ్ కుడాషేవ్ తెలిపారు. అయితే, త్రైపాక్షిక చర్చల గురించి రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ వివరాలు వెల్లడించలేదు.