20 మంది సైనికుల ప్రాణాలను బలిగొన్న చైనాపై యావత్ దేశం భగ్గుమంటున్న విషయం తెలిసిందే. చైనా కుట్రల నేపథ్యంలో ‘బాయ్కాట్ చైనా’ నినాదం మార్మోగుతుండగా, చైనా కంపెనీల వస్తువులను ఎవరూ కొనరాదని చివరకు వర్తక సంఘాలూ ప్రచారం చేస్తున్న సంగతి విదితమే. బాయ్కాట్ నినాదంతో భారత్కు చైనా ఎగుమతులు రూ.1.3 లక్షల కోట్ల మేర ప్రభావితం కావచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అఖిల భారత వర్తక సంఘం 3 వేల చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చింది. ప్రచారం చేయవద్దని సినీ, క్రీడాకారులకు లేఖలు కూడా రాయగా, ఇటీవల 3 చైనా కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్నీ కోరింది. వ్యాపారులు, వినియోగదారుల నుంచి కూడా గొప్ప మద్దతు లభిస్తున్నది. దీంతో కొనసాగింపుగా మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. దేశంలోకి దిగుమతి అవుతున్న చైనా వస్తూత్పత్తులపై భారీ ఎత్తున సుంకాలను విధించేందుకు భారత్ సమాయత్తమవుతున్నది. ఈ క్రమంలోనే సదరు దిగుమతుల జాబితాను కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ సిద్ధం చేస్తున్నది.
సరిహద్దుల్లో చైనా దుశ్చర్యను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుండగా, డ్రాగన్పై ఆర్థిక, వాణిజ్యపరమైన ఒత్తిడిని పెంచాలన్న నిర్ణయానికి వచ్చింది. ముడి ఔషధ పదార్థాలు, పారిశ్రామిక రసాయనాలు, టెలికం ఎక్విప్మెంట్, తోలు ఉత్పత్తులు, ఉక్కు వస్తువులు, రత్నాలు, ఆభరణాలు, ఫర్నీచర్, హార్డ్వేర్, టెక్స్టైల్స్ తదితర చైనా నుంచి భారత్కు దిగుమతి అవుతున్న వాటిపై సుంకాలను పెంచాలని వాణిజ్య శాఖకు సూచనలు అందాయి. ఈ విషయంలో వ్యాపార, పారిశ్రామిక వర్గాలు, ఎగుమతి సంఘాలతోనూ ముమ్మర చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే 111 చైనా ఉత్పత్తులపై బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దిగుమతి సుంకాలను పెంచినది తెలిసిందే. అయితే ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనలు కేంద్రం సుంకాల పెంపు యోచనకు కొంత అడ్డంకిగా నిలుస్తున్నాయి. కేవలం ఒక్క దేశంపై సుంకాల భారాన్ని మోపడం ఈ నిబంధనలకు విరుద్ధం. దీంతో చైనా నుంచే ఎక్కువగా దిగుమతి అవుతున్న వస్తువులపైనే భారత్ దృష్టి పెడుతున్నట్లు సమాచారం.
చైనా నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై భారత్ సుంకాలను పెంచితే... దేశంలో తయారయ్యే వస్తువులకు డిమాండ్ పెరుగుతుందని అంటున్నారు. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీదీ దేశంలోనే తయారైతే బాగుంటుందని అనిపిస్తున్నా.. అది ఆచరణీయం కాదని ఆర్థికవేత్త యోగేంద్ర కపూర్ అభిప్రాయపడ్డారు. చైనా నుంచి ఎలక్ట్రానిక్, ముడి ఔషధ పదార్థాలు 70 శాతం చొప్పున, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 45 శాతం, తోలు ఉత్పత్తులు 40 శాతం, ఆటో విడిభాగాలు 20 శాతం మేర దిగుమతి అవుతున్నట్లు గుర్తుచేశారు. మరోవైపు నిర్మాణ రంగ సంఘం క్రెడాయ్ కూడా తమ సభ్యులను చైనా తయారీ వస్తువులను వాడరాదంటూ కోరింది.