మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు నేడు. పని చేసుకోండి అని పని ఇచ్చి , నెల తిరిగే లోపల జీతం ఇచ్చి , మూడు పుట్ల కడుపునిండా భోజనం పెట్టి ఆదరిస్తున్న పాముకు పాలు పోసినట్లు తిరిగి యజమానిని కాటు వేస్తున్నారు. అన్నం పెట్టిన చేతిని విరిచేసి యజమాని జీవితాన్ని అర్ధాంతరంగా చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ము కోసం దురాశతో వారి కాలగమనాన్ని ఆపేస్తున్నారు. నిద్రలో ఉంటున్న యజమానులను శాశ్వత నిద్రలోకి పంపిస్తున్నారు.
బంగారం కోసం బలవంతంగా చంపేస్తున్నారు. కాసుల కోసం క్రూరమైన మృగాలు లాగా మారుతున్నారు. అన్నం పెట్టిన విశ్వాసం కూడా లేకుండా మరణాన్ని అందిస్తున్నారు. ఇంట్లో పనికి ఎవరిని పిలవాలన్న భయంతో వణికిపోతున్న యజమానులు. మనుషుల్లో మానవత్వం పోతుందా అనే ప్రశ్నకు ఇలాంటి సంఘటనలు సమాధానంగా మారుతున్నాయా..??
నమ్మి పనిలో పెట్టుకున్నందుకు ఓ పని మనిషి ఘాతుకానికి పాల్పడింది. యజమానురాలైన వృద్ధురాలిని చంపి.. పది తులాల బంగారు ఆభరణాలతో ఉడాయించింది. హైదరాబాద్ కాచిగూడలో ఈ ఘటన వెలుగుచూసింది. హైదరాబాద్ కాచిగూడ చప్పల్బజార్లోని ఓ ఇంట్లో కమలమ్మ అనే వృద్ధురాలు నివసిస్తున్నారు. ఆమె కుమారుడు నాగోల్లో ఉండటంతో ఇంట్లో ఆమె ఒక్కరే ఉంటున్నారు. కమలమ్మ బాగోగులు చూసుకోవడానికి ఉప్పల్లోని ఓ ఏజెన్సీని సంప్రదించి, ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన లక్ష్మిని మూడు రోజుల క్రితం పనిలో పెట్టుకున్నారు.
ఉదయం ఇంట్లో కమలమ్మ నిద్రిస్తున్న స్థితిలో ఉండటాన్ని స్థానికులు చూశారు. తట్టిలేపేందుకు ప్రయత్నించినా లేవపోవటం వల్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి వచ్చి పోలీసులు పరిశీలించారు. వృద్ధురాలి చేతికి ఉండాల్సిన బంగారు గాజులు, బీరువాలోని నెక్లెస్, మొత్తం పది తులాల బంగారు ఆభరణాలు, రూ.5వేలు కనిపించలేదు. కమలమ్మ ముఖంపై దిండుతో అదిమి చంపేసి.. అనంతరం నగలు, నగదుతో పనిమనిషి లక్ష్మి పారిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.