గల్వాన్లో చైనా సైనికుల దాడులు, భారత సైనికులు అమరులవడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. చైనా చర్యలను ప్రపంచం సైతం తప్పు పడుతోంది. ఈ దూకుడుపై అభ్యంతరం తెలుపుతోంది. అయితే, దీనిపై మరింత ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. చైనా ఆగడాలు మరింతగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇంకో అంశం తెరమీదకు వచ్చింది. ఎల్ఏసీపై కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య నిపుణులు అండమాన్-నికోబార్ దీవుల భద్రతపై దృష్టి సారిస్తున్నారు. అండమాన్, నికోబార్ దీవుల చుట్టుపక్కలున్న సముద్రతీర ప్రాంతాలలో భారత నావికా దళం మరింత అప్రమత్తమయ్యింది.
అండమాన్-నికోబార్ దీవుల భద్రతపై భారత రక్షణ సంస్థల ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఎల్ఏసీలో దెబ్బతిన్న చైనా ఇతర మార్గాలలో భారత్కు హాని తలపెట్టే ప్రయత్నం చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇదిలాఉండగా, పక్కా ప్లాన్ ప్రకారమే జరిగాయని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ‘గల్వాన్ నదీ ప్రవాహాన్ని ముందస్తుగా అడ్డుకున్నాయి. భారత సైనికులు జూన్ 15న ఘటనాస్థలికి చేరుకోగానే అడ్డుకట్టను తొలిగించాయి. నీటి ప్రవాహం వల్ల సైనికులు నియంత్రణ కోల్పోయారు. మరికొంతమందిని చైనా బలగాలు నీటిలోకి తోసేశాయి’ అని ఆయన వివరించారు.
ఘర్షణలకు ముందే డ్రోన్లతో చైనా దళాలు భారత భూభాగాల్లో నిఘాను కొనసాగించాయని, భారత బలగాల సామర్థ్యాన్ని అంచనా వేసుకున్నాక, వారి బలగాల్ని ఎల్ఏసీకి అటువైపునకు మోహరించాయని చెప్పారు. తోపులాట, ఘర్షణల కంటే ముందే చైనా దళాలు హెల్మెట్లు ధరించి మేకులతో చుట్టిన కర్రలతో భారత సైన్యంపై దాడికి పాల్పడ్డాయన్నారు. గల్వాన్ లోయలోని ఎల్ఏసీ గుండా గత ఏప్రిల్ నుంచి భారత బలగాలు ఏకపక్షంగా రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి పూనుకున్నాయి. ఈక్రమంలోనే సరిహద్దుల్లో గత రెండు నెలలుగా ఉద్రిక్తతలు పెరిగాయి‘ అని చైనా ఆరోపించింది. దౌత్యపరమైన చర్చల ద్వారా వివాదాల్ని పరిష్కరించుకొని, సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పేందుకు భారత్ ప్రయత్నిస్తుందని తాము భావిస్తున్నట్టు చైనా తన ప్రకటనలో వివరించింది.