దేశంలో కరోనా వైరస్ తో ప్రజలు ఎన్నో ఇక్కట్లు పడుతున్నారు. ఇప్పటి వరకు ఎన్నడూ చూడని దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. మానవత్వం మరచిన సంఘటనలు కనిపిస్తున్నాయి. ఇక కరోనాతెో చనిపోయిన వారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.. ఆ మద్య ఓ చెత్త బండిలో బాడీని పంపించిన విషయం సంచలనం రేపింది. తాజాగా క్వారంటైన్లో ఉండి విడుదల అయ్యే కొన్ని గంటల ముందు ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. ఆయన చనిపోయిన కొద్ది సేపటికే రిపోర్టులు రాగా, వాటిలో కరోనా నెగెటివ్గా వచ్చింది. ఈ విషాద ఘటన జమ్మూ కశ్మీర్లోని కఠువా జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడిని హీరానగర్లోని చిపాకి కాలా గ్రామానికి చెందిన 50 ఏళ్ల కమల్ కుమార్గా గుర్తించారు.
‘క్వారంటైన్కు తీసుకువచ్చిన మరుసటి రోజే అతడి నమూనాలను కరోనా పరీక్షలకు పంపారు. అతనికి కాలేయ సంబంధిత వ్యాధి ఉండడంతో ఈ నెల 17న ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఈ ఘటన గురించి కఠువా జిల్లా అభివృద్ధి అధికారి ఓపీ భగత్ మాట్లాడుతూ.. ఈ నెల 15న అతడు ముంబై నుంచి తిరిగి రావడంతో అధికారులు చంగారన్ క్వారంటైన కేంద్రానికి తరలించారని తెలిపారు. కొవిడ్-19 ప్రొటోకాల్ ప్రకారం నెగిటివ్ వచ్చిన వారిని విడుదల చేసే ముందు మళ్లీ శాంపిల్స్ తీసుకుని పరీక్షలకు పంపినట్టు చెప్పారు. దీంతో అతడు తిరిగి క్వారంటైన్ కేంద్రానికి వచ్చాడు.
20న వచ్చిన ఫలితాల్లో కుమార్కి కరోనా నెగిటివ్గా వచ్చింది’ అని తెలిపారు ఆయన. ఇక క్వారంటైన్ కేంద్రంలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్గా తేలడంతో కుమార్ విడుదల ఆలస్యం అయిందని భగత్ తెలిపారు. ఆదివారం విడుదల కావాల్సి ఉండగానే కుమార్ మృతి చెందాడనీ.. గుండెపోటు వల్లే అతడు మృతిచెందినట్టు భగత్ వెల్లడించారు. ఇదిలా ఉంటే అక్కడ అతన్ని సరిగా చూడలేదన్న టాక్ వినిపిస్తుంది. కుమార్ చనిపోయాడని క్వారంటైన్లో ఉన్న మిగతావారంతా ఆందోళన చేపట్టారు. వెంటనే సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.