తెలంగాణలో కరోనా కేసులు రోజూ వందల సంఖ్యలో నమోదవుతున్న వేళ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ప్రజావ్యతిరేకత పెల్లుబుకుతోంది. గత ఐదు రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కరోనా పరీక్షలు 12623 కాగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2396గా ఉందని హెల్త్బులిటెన్లో వివరాల ప్రకారం తెలుస్తోంది. ఈ లెక్కలు రాష్ట్రంలో కరోనా ఏ స్థాయిలో విస్తరించిందో తెలియజేస్తోంది. తెలంగాణలో వైరస్ విస్తరణ పెద్దగా లేదని ఇప్పటిదాకా ప్రభుత్వం చెప్పిన మాటలు తప్పని తేలిపోతోంది. పరీక్షల సంఖ్య పెంచాలని ప్రభుత్వానికి సూచించినా పట్టించుకోని ఫలితంగా ఇప్పుడు ప్రాణాలను బలి ఇవ్వాల్సిన స్థితికి చేర్చిందన్న విమర్శలను విపక్షాలు చేస్తున్నాయి. ఈవిషయంలో ఏపీలోని జగన్ ప్రభుత్వం సమర్థతను కొనియాడుతున్నారు.
ముందు ఎంతో వేగంగా పెరిగినా కరోనా వైరస్ ఉధృతిని అదుపు చేయడమే కాకుండా పరీక్షల సంఖ్య గణనీయంగా పెంచడంతోపరిస్థితి చేయి దాటిపోకుండా అడ్డుకోగలిగారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో వెల్లడైన కరోనా ఫలితాల ఒకసారి పరిశీలిస్తే... తెలంగాణలో 3297 మందికి పరీక్షలు నిర్వహించగా..730మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఏపీలో ఆదివారం ఒక్కరోజులో 24451 పరీక్షలు చేస్తే పాజిటివ్ వచ్చిన కేసులు కేవలం 477. ఏపీ స్థాయిలో మన దగ్గర పరీక్షలు చేస్తే 5000 కు పైగా కేసులు వచ్చే అవకాశం ఉందన్న వాదనను విపక్షాలు బలంగా వినిపిస్తున్నాయి.
అసలు కరోనా వస్తే ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ప్రభుత్వం అందించే సదుపాయాలు ఏమిటి? అనే అవగాహన కల్పించే నాధుదే రాష్ట్రంలో కరువయ్యాడన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసులు ఎక్కువగా ఉన్నా ...చావులు తక్కువగా ఉన్నాయన్న ప్రభుత్వ వాదన శుద్ద అబద్దమని తేలిపోతోందని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. అసలు శవాలకు పరీక్షలు చేస్తే కదా మరణం కరోనా వల్లనా... ఇతర కారణాల వల్లానా అని తెలిసేది... హైకోర్టు శవాలకు కరోనా పరీక్షలు చేయాలని సదుద్దేశంతో ఆదేశాలు ఇస్తే, సాంకేతిక కారణాలు చూపించి సుప్రీం కోర్టులో స్టే తెచ్చు కున్నారు... ఇంత కన్నా హేయమైన చర్య ఉంటుందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.