ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. కేవలం ఆదివారం ఒక్క రోజే ప్రపంచంలోని అన్ని దేశాల్లో కలిపి 1,83,000 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి.శనివారం ఆదివారం మధ్య గడచిన 24 గంటల్లో ఏకంగా 1.83 లక్షల కొత్త కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) వెల్లడించింది. ఒక్క రోజు వ్యవధిలో ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇందులోనూ ముఖ్యంగా మూడు దేశాల్లోనే సగానికి పైగా కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. అత్యధికంగా బ్రెజిల్లో 54,771, అమెరికాలో 36,617, భారత్లో 15,413 కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) పేర్కొంది.
ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90,44,563కి చేరింది. ఈ మహమ్మారి వల్ల గత మూడు నెలల్లో ఇప్పటివరకు 4,70,665 మంది బాధితులు మరణించారు. వైరస్ బారినపడిన 48,37,952 మంది కోలుకోగా, మరో 37,35,946 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా విలయం సృష్టిస్తూ కేసుల సంఖ్య గణనీయంగా పెంచుతోంది. పెరుగుతున్న కేసులతో అన్ని దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ఎన్నో చర్యలు చేపడుతన్నా కంట్రోల్ కావటం లేదని ఆందోళన చెందుతున్నాయి.అయితే బ్రెజిల్లో కరోనా కేసులు భారీ వేగంగా రికార్డవుతున్నాయి.
ఇప్పుడు మొదటి స్థానంలో ఉన్న బ్రెజిల్ సగటు కేసుల్లో మించిపోయే అవకాశం స్పష్టంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక రష్యాలో ఇప్పటివరకు 5,84,680 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కరోనా వైరస్ మహమ్మారికి 8,111 మంది బాధితులు మృత్యువాత పడ్డారు. ఇక భారత్లో నిన్న ఒక్క రోజే 15 వేల400 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 4లక్షల26వేల910కి చేరింది. భారత్ లో మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో అధికంగా కేసులు నమోదవుతున్నాయి. భారత్లో ఇప్పటివరకు 13,703 మంది చనిపోయారు.