దేశరాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. ప్రభుత్వం వివిధ ఆంక్షలతో కట్టడి చేస్తున్నామని చెబుతున్నా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏమాత్రం అదుపులో ఉండకపోవడం గమనార్హం. ఢిల్లీ వైద్యఆరోగ్యశాఖ విడుదలచేసిన బులెటిన్ ప్రకారం శనివారం నుంచి ఆదివారం మధ్యలో గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 3వేల కొత్త కేసులు నమోదవడం గమనార్హం. ఇక 1719 మంది డిశ్చార్జి కాగా.. 63 మంది మరణించారు. తాజా లెక్కలతో కలిపి ఢిల్లీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59,746కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 33,013 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 2175 మంది మరణించారు. ప్రస్తుతం ఢిల్లీలో 24,558 యాక్టివ్ కేసులున్నాయి.
ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణపై హోం మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. తాజాగా ఢిల్లీ ప్రభుత్వానికి కొన్ని అతి ముఖ్యమైన సూచనలు చేశారు. కరోనా వైద్య పరీక్షలను ఉధృతం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్న వేళ కేంద్ర హోం మంత్రి ఇప్పుడు రంగంలోకి దిగడం ఇప్పుడు రాజకీయంగానూ హాట్ టాపిక్గా మారింది. కేంద్ర హోం మంత్రి అమిత్షా ఢిల్లీలో నమోదవుతున్న కేసులపై నిశితంగా పరిశీలిస్తున్నారు. కంటోన్మెంట్ జోన్లలో నిబంధనలు సక్రమంగా అమలయ్యేలా పర్యేవక్షిస్తున్నారు. కరోనా రోగి ఎవరు మరణించినా.. ఏ పరిస్థితుల్లో మరణించాడన్న అంశంపై కేంద్రానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు రిపోర్టు చేయాలని ఆదేశించారు.
అటు-అమిత్ షా నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి కమిటీ కూడా ఏర్పాటైంది. కరోనా రోగులందరి కాంటాక్టులను ఐసొలేట్ చేయాలని, కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ఆరోగ్యసేతు, ఇతిహాస్ యాప్ లను అందరూ వినియోగించుకోవాలని ఈ కమిటీ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇదిలా ఉండగా భారత్ లో కరోనా మహమ్మారివేగంగా విస్తరిస్తోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తుంది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్ , ఢిల్లీలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే భారత్ లో జూలై 1 నాటికి కరోనా కేసులు 6 లక్షలకు చేరతాయన్న మిచిగన్ వర్సిటీ ప్రొఫెసర్ భ్రమర ముఖర్జీ స్టేట్ మెంట్ భారతీయులను కలవరపరుస్తోంది