కరోనా వైరస్.. ఏ దేశంలో చూసినా ఈ మహమ్మారి పేరే వినిపిస్తోంది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ కరోనా భూతం అనతి కాలంలోనే దేశదేశాలు విస్తరించి.. ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 4.67 లక్షలకు పైగా చేరగా.. పాజిటివ్ కేసులు సంఖ్య 90 లక్షలకు చేరువలో నిలిచింది. భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవ్వడంతో.. అన్ని దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. ముఖ్యంగా అమెరికా, బ్రెజిల్, రష్యా, భారత్, బ్రిటన్, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాలు కరోనా దెబ్బకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
అలాగే భారత్లోనూ కరోనా వైరస్ రోజురోజుకూ బలపడుతోంది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదువుతూనే ఉన్నాయి. అత్యధిక కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానానికి చేరుకుంది. ఇదిలా ఉంటే.. మరోపక్క కరోనా గురించి కొన్ని షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. వైద్య నిపుణురాలు, చైనా కోవిడ్-19 నిపుణుల బృందంలో ఒకరైన లీ ల్యాన్జువాన్ కరోనా గురించి కీలక విషయాలు వెల్లడించారు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో కరోనా దశాబ్దాల పాటు జీవిస్తుందని పేర్కొన్నారు.
మైనస్ 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కొన్ని నెలల పాటు తన ఉనికి చాటుకోగలదని, మైనస్ 20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతల వద్ద 20 ఏళ్లకుపైగా జీవించి ఉండే అవకాశాలు ఉన్నాయని లీ ల్యాన్జువాన్ అంటున్నారు. అలాగే కరోనా మొదలైన తొలినాళ్ల నుంచి చోటుచేసుకున్న పరిణామాలను లోతుగా అధ్యయనం చేయగా.. అత్యంత శీతల ప్రదేశాల్లోనూ వైరస్ ఎక్కువకాలం మనుగడ సాధించగలదనే విషయం స్పష్టమతోందని అన్నారు. మాంసాన్ని ఎక్కువ కాలం పాటు నిల్వ చేసే సముద్ర ఆహార ఉత్పత్తుల మార్కెట్లోనే వైరస్ మూలాలు బయటపడినందున ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చిరించారు. కాగా, మరోవైపు కరోనాను నివారించేందుకు ప్రపంచదేశాల శాస్త్రవేత్తలు తీవ్ర ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.