ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాల విషయంలో జగన్ సర్కార్ దూకుడుగా వెళ్తుంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే లెక్క చేయకుండా సీఎం జగన్ సంక్షేమ కార్యక్రమాల్లో దూకుడు ప్రదర్శిస్తున్నారు. గత యేడాది కాలంలో చూస్తే జగన్ ఇచ్చిన హామీలే కాకుండా మేనిఫెస్టోలో చెప్పని 40 పథకాలను కూడా ప్రజలకు చేరువ చేశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగానే ఈ రేంజ్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తోన్న రాష్ట్రం మరొకటి లేదనే చెప్పాలి. అయితే ఇవి క్షేత్ర స్థాయికి వెళ్లేసరికి కాస్త సిఎం కి ఇబ్బంది గానే ఉంటుంది అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
అవును క్షేత్ర స్థాయిలో అవి అధికారుల తీరు తో పాటుగా వైసీపీ నేతల తీరుతో ఇవి జగన్కు, వైసీపీ ప్రభుత్వానికి ప్లస్ అయ్యేలా ప్రజల్లోకి వెళ్ళడం లేదని, కావాల్సిన వారికి మాత్రమే ఇస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఏర్పడింది. ఇది మరింతగా పెరిగింది అంటే మాత్రం కచ్చితంగా జగన్కు, ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయి అని పలువురు హెచ్చరిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో కూడా దీనిపై పెద్ద చర్చ జరుగుతుంది. ఇందుకు ప్రధాన కారణం స్థానిక ప్రజా ప్రతినిధులు, ద్వితీయ శ్రేణి కేడర్ తమకు వ్యతిరేకంగా ఉన్న వాళ్లు, ఇతర పార్టీలకు చెందిన వారి పనులు చేయడం లేదన్న టాక్ అయితే వచ్చేసింది.
ఇక వైసీపీలో ఉన్న రెండు గ్రూపులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం కూడా పార్టీకి మైనస్ అవుతోంది. చివరకు వైసీపీ నేతలు సైతం తమ పార్టీ నేతలనే సోషల్ మీడియా లో టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. కావాల్సిన వాళ్ళకే ఇస్తున్నారు ఇళ్ళ పట్టాలు అయినా... నవరత్నాలు అయినా సరే వాలంటీర్ లకు సన్నిహితంగా ఉన్న వారికే వెళ్తున్నాయి అన్న వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు అంతిమంగా జగన్కే ఇబ్బందికరంగా మారాయి. సిఎం దీని మీద దృష్టి పెట్టాలి అని... లేకపోతే అసలుకే మోసం వస్తుంది అన్న టాక్ ఇప్పుడు వైసీపీ క్షేత్ర స్థాయిలో ఎక్కువుగా వినిపిస్తోంది.