భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన  ఘర్షణలో మరణించిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు కుటుంబాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం  సుర్యాపేటలో పరామర్శించారు. మంత్రులు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్  కుమర్ లతో కలిసి సోమవారం మధ్యాహ్నం సూర్యాపేటకు చేరుకున్న కేసిఆర్, ముందుగా సంతోష్ చిత్రపటానికి పూవులు చల్లి అంజలి ఘటించారు. అనంతరం సంతోష్ భార్య సంతోషి, తల్లితండ్రులు మంజుల, ఉపేందర్, సోదరి శృతిలను ఓదార్చారు. సంతోష్ త‌ల్లి మంజుల‌ను కొనియాడారు. దేశ ర‌క్ష‌ణ‌లో ప్రాణాలు కోల్పోయిన‌ప్పుడు మీరు ప్ర‌ద‌ర్శించిన మ‌నోధైర్యం అసామాన్యమ‌ని అన్నారు. ఒక వీరుడిని క‌న్నావ‌మ్మా అంటూ మంజుల గారిని ప్ర‌శంసించారు.

 

అలాగే   సంతోష్ పిల్లలు, అభిగ్న, అనిరుధ్ తేజలతో మాట్లాడారు. దేశరక్షణ కోసం సంతోష్ ప్రాణత్యాగం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు.  సంతోష్ మరణం తనను ఎంతగానో కలచివేసిందని ముఖ్యమంత్రి చెప్పారు.   ప్రభుత్వం సంతోష్ కుటుంబానికి ఎల్లవేళ్లలా అండగా వుంటుందని హామి ఇచ్చారు.   ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలని చెప్పారు.   సంతోష్ కుటుంబ  బాగోగులు చూసుకోవాలని మంత్రి జగదీశ్ రెడ్డిని ముఖ్యమంత్రి కోరారు.  సంతోష్ భార్య సంతోషీకి గ్రూప్ ఒన్ ఉద్యోగం ఇచ్చే నియామక పత్రాన్ని ముఖ్యమంత్రి స్వయంగా అందజేశారు. హైదరాబాద్ లోని బంజార్ హిల్స్ లో 711 గజాల స్థలానికి సంబంధించిన పత్రాన్ని సంతోష్ భార్యకు ముఖ్యమంత్రి అందించారు.   సంతోష్ భార్యకు రూ. 4 కోట్ల చెక్కును, తల్లితండ్రులకు రూ.1 కోటి చెక్కును ముఖ్యమంత్రి అందించారు.  


కార్యక్రమంలో  రాజ్యసభ సభ్యులు జె.సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్  నేతి విద్యాసాగర్, ఎంఎల్ఎలు  గ్యాదరి కిషోర్, బొల్లం మల్లయ్యయాదవ్, చిరుమర్తి లింగయ్య, భూపాల్  రెడ్డి, సైదిరెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ దీపికా యుగంధర్,  మున్సిపల్  చైర్ పర్సన్ అన్నపూర్ణమ్మ, డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, టిఆర్ఎస్ రాష్ర్ర ప్రధాన కార్యదర్శి తక్కెల్లపల్లి రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: