తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ చాణాక్యం గురించి చెప్పనక్కర్లేదు. తనదైన శైలిలో రాజకీయ ఎత్తులు, పరిపాలన సంబంధమైన నిర్ణయాలు తీసుకునే గులాబీ దళపతి తాజాగా తీసుకున్న నిర్ణయం ఆయన ప్రత్యర్థులను సైతం ఆశ్చర్యపరిచింది. ఇంకా చెప్పాలంటే, బహిరంగంగానే ప్రశంసించే స్థాయికి చేరుకుంది. ఇదంతా చైనా-భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల సమయంలో కన్నుమూసిన మన కల్నల్ సంతోష్బాబు కుటుంబానికి తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ఆర్థిక సహాయం గురించి. కాంగ్రెస్ నేత, ఎంపీ అభిషేక్ సింఘ్వి చేసిన ప్రశంస గురించి.
చైనా-భారత్ సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో ఈనెల 15వ తేదీన జరిగిన సైనిక ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందారు. దొంగచాటుగా చైనా సైనికులు జరిపిన దాడిలో వారంతా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో తెలంగాణకు చెందిన సంతోష్ బాబు సైతం ఉన్నారు. ఆయన కుటుంబానికి అండగా నిలిచేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కల్నల్ సంతోష్ భార్య సంతోషికి.. 5 కోట్ల చెక్తో పాటు డిప్యూటీ కలెక్టర్ జాబ్ ఇవ్వనున్నట్లు ప్రకటించిన కేసీఆర్... ఇవాళ సూర్యాపేట వెళ్లి.. కల్నల్ సంతోష్ కుటుంబాన్ని పరామర్శించారు. కల్నల్ కుటుంబసభ్యులకు చెక్, జాబ్ ఆఫర్తో పాటు ఇంటి స్థలానికి చెందిన పత్రాల్ని అందించారు.
కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వి మాత్రం పబ్లిక్గానే తన భావాలను పంచుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్... సైనిక కుటుంబాన్ని ఆదుకున్న తీరును ఆయన ప్రశంసించారు. కల్నల్ సంతోష్బాబు కుటుంబం అనుభవిస్తున్న బాధను తీర్చేందుకు.. తెలంగాణ సర్కారు వేగంగా స్పందించిన తీరును ఆయన సోషల్ మీడియా వేదికగా మెచ్చుకున్నారు. తెలంగాణ విధానాన్ని ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించాలని సింఘ్వి ఆయన సూచించారు. కల్నల్ సంతోష్ భార్య సంతోషికి తెలంగాణ సర్కార్ డిప్యూటీ కలెక్టర్ నియామక పత్రాన్ని అందజేసిందని, కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి విధానాన్ని అనుసరించాలని ఎంపీ అభిషేక్ సింఘ్వి కోరారు. కాగా, కేసీఆర్ అంటేనే కారాలు-మిరియాలు నూరే కాంగ్రెస్ నేతలకు నిజంగా ఈ ఢిల్లీ పెద్దాయన చుక్కలు ఇరకాటంలో పడేశారంటున్నారు. తన ప్రత్యర్థులతో కూడా ప్రశంసలు పొందడం...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతమని...ఆయన అనుచరులు పేర్కొంటున్నారు.