ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్న కరోనా విషయంలో ప్రపంచం మొత్తం ఆనందించదగిన గుడ్ న్యూస్ వచ్చేసింది. కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు తొలి వ్యాక్సీన్ సిద్ధం అయ్యింది. అయితే ఈ ఘనత సాధించింది.. భారత్, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, చైనా, ఆస్ట్రేలియా వంటి దేశాలేవీ కాదు.. ఈ ఘనత సాధించింది నైజీరియా వంటి దేశం కావడం విశేషం.
కరోనా వైరస్కు నైజీరియా శాస్త్రవేత్తల బృందం వ్యాక్సిన్ కనుగొన్నట్టు ప్రకటించుకుంది. కరోనాకు ఇప్పటి వరకూ వ్యాక్సీన్ లేకపోవడంతో అది ఇష్టారీతిన రెచ్చిపోతోంది. రోజూ ప్రపంచ వ్యాప్తంగా లక్షల్లో కేసులు వస్తున్నాయి. వేల సంఖ్యలో మరణిస్తున్నారు. వ్యాక్సీన్ వస్తే తప్ప దీని దూకుడు అడ్డుకోలేమని మహామహా శాస్త్రవేత్తలే చేతులెత్తేశారు.
ఇలాంటి సమయంలో నైజీరీయా సైంటిస్టులు ఈ శుభవార్త చెప్పారు. ఈ కరోనా వ్యాక్సీన్ ఆఫ్రికాలో ఆఫ్రికన్ల కోసం రూపొందించారట. ఈ వ్యాక్సీన్ గురించి అడిలెక్ యూనివర్సిటీలో మెడికల్ వైరాలజీ, ఇమ్యునాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్ సైంటిస్ట్ డాక్టర్ ఒలడిపో కొలవోల్ ప్రకటించారని ది గార్డియన్ నైజీరియా పత్రిక బయటపెట్టింది. అయితే ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు మాత్రం ఏడాదిన్నర పడుతుందని అంటున్నారు.
ఎందుకంటే వ్యాక్సీన్ తయారీకి అనుమతి రావాలంటే.. ఈ వ్యాక్సీన్ కు మరిన్ని ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంటుందట. ఈ వ్యాక్సిన్ కనుక్కోవడం నిజమేనని ప్రీసియస్ కార్నర్స్టోన్ వర్సిటీ ప్రొఫెసర్ జూలియస్ ఒలోక్ కూడా ధ్రువీకరించారు. ఇంకో ఏడాదిన్నర కాలమంటే ఎక్కువ సమయమే అయినా.. ఎక్కడో ఓచోట ముందడుగు అంటూ పడినందుకు సంతోషించాల్సిందే.