ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలోని బాలికల వసతిగృహంలో ఉన్న 57 మంది బాలికలకు కరోనా సోకడంతోపాటు వారిలో ఏడుగురు గర్భం దాల్చి ఉండటం, మరో బాలిక హెచ్ఐవీ పాజిటివ్ అని తేలిన ఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన హెచ్ ఆర్సీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు యూపీ డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ వసతిగృహంలో బాలికలకు కరోనా రావడంతోపాటు గర్భం దాల్చిన ఘటనపై పత్రికల్లో వచ్చిన వార్తలను సుమోటోగా విచారణకు స్వీకరించిన మానవహక్కుల కమిషన్ అధికారుల వైఫల్యంపై నివేదిక సమర్పించాలని యూపీ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది.
ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ప్రభుత్వ పిల్లల ఆశ్రమంలో కరోనా కలకలం రేపింది. ఏకంగా 57 మంది బాలికలకు కరోనా సోకడమే కాకుండా ఇందులోని ఐదుగురు గర్భం దాల్చినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. అంతేకాకుండా ఒకరికి హెచ ఐవీ సోకినట్లు కూడా తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ సోకని మిగతా బాలికలు, సిబ్బందిని క్వారంటైన్లో ఉంచి, ఆ భవనాన్ని సీజ్ చేశారు. అయితే, ఈ వసతిగృహంలోని కనీసం ఇద్దరు బాలికలు గర్బందాల్చినట్టు వైద్య పరీక్షల్లో తేలిందని స్థానిక మీడియాలో ఆదివారం విస్తృత ప్రచారం సాగడంతో బాలికల భద్రతపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విషయంపై మీడియాలో విస్తృతంగా కథనాలు ప్రసారం కావడంతో ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇదిలా ఉంటే బాలికల ఆశ్రమంలో గర్భిణిలు ఉండటంపై స్థానికంగా పలు వార్తలు రాగా.. దినేష్ కుమార్ వాటిని ఖండించారు. ఆశ్రమంలోకి రాకముందే వారు గర్భం దాల్చారని, దానికి సంబంధించిన దర్యాప్తు కూడా జరుగుతోందని కాన్పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దినేష్ కుమార్ వెల్లడించారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ ప్రబలడంపై అధికారులు స్పష్టత ఇచ్చారు. ఆశ్రమంలో ఏడుగురు గర్భిణి మహిళలు ఉన్నారని, అందులో ఐదుగురికి కరోనా సోకిందని తెలిపారు. కరోనా సోకిన అందరికీ కాన్పూర్ మెడికల్ కాలేజీలో చికిత్స జరుగుతున్నట్లు వెల్లడించారు. ఆశ్రమంలో కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందిందన్న దానిపై దర్యాప్తు చేస్తామని ఆయన వెల్లడించారు.