ప్రపంచంలో కరోనా వైరస్ ఎప్పటి నుంచి మొదలైందో.. అప్పటి నుంచి సినీ పరిశ్రమలో గందరగోళం మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లు, మాల్స్ పూర్తిగా మూసివేశారు. రిలీజ్ అయ్యే సినిమాలు క్యాన్సల్ చేశారు. షూటింగ్స్ కూడా ఆపివేశారు. ఇలా సినీ ప్రపంచం మొత్తం అష్టదిగ్భందం అయ్యింది. ప్రపంచంలో కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి.. వాటి తో పాటు మరణాల సంఖ్య కూడా పెరిగిపోతున్నాయి. మనిషి జీవితంలో మాస్క్, శానిటైజర్ లు ముఖ్యభాగాలు అయ్యాయి. సామాజిక దూరం పాటిస్తున్నారు.. ఎవరైనా తుమ్మినా, దగ్గినా దూరంగా జరిగిపోతున్నారు. రెండు నెలల క్రితం వరకు వివిధ దేశాల్లో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మద్య కొన్ని దేశాల్లో లాక్ డౌన్ సడలింపు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల థియేటర్లు ఓపెన్ చేసేందుకు సిద్దమవుతున్నారు. లాక్ డౌన్ సడలించినప్పటి నుంచి స్సులు, రైళ్లు, విమానాలు తెగ తిరిగేస్తున్నాయి. ఫ్రాన్స్లో థియేటర్లను కూడా బార్లా తెరిచేశారు. బస్సు, రైలు, విమాన ప్రయాల్లో అన్ని గంటలు ప్రయాణిస్తున్నారు.. థియేటర్లో రెండు గంటలు పెద్ద సమస్య కాదంటున్నారు. థియేటర్లు కూడా టికెట్లపై డిస్కౌంట్లు, ఇతర ఆకర్షణీయ ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. అంతే కాదు కరోనా వ్యాపించకుండా హాళ్లలో భౌతిక దూరం కోసం సీట్ల మధ్య మినియన్స్(కామెడీ బొమ్మ)లను కూర్చోబెడుతున్నారు.
జంటల కోసం ప్రత్యేక సీట్లు.. కుటుంబ సభ్యుల కోసం మరికొంత వెసులు బాటు చేస్తూ వారు కూర్చోవడానికి కొన్ని చోట్ల రెండు మూడు సీట్లను వరుసగా ఖాళీగా వదిలేసి తర్వాత బొమ్మలు పెట్టారు. తమ థియేటర్లలో బొమ్మలు, శానిటైజర్లు, స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తూ పక్కడ్బందీగా వ్యవహరిస్తున్నామని పారిస్ నగరంలోని ఎంకేటూ థియేటర్ యాజమాన్యం చెప్పింది. కరోనా కేసుల విషయంలో తగు జాగ్రత్తలు పాటిస్తున్నామని.. కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని థియేటర్ల యాజమాన్యం తెలుపుతున్నారు.