గత నెలలో 97మందిని పొట్టనపెట్టుకున్న పాక్​ విమాన ప్రమాదం.. మానవ తప్పిదమేనని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ మేరకు విచారణ కమిటీ అందించిన నివేదికను ప్రధానమంత్రికి సమర్పించారు విమానయాన శాఖ మంత్రి. ఘటనా సమయంలో ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తలేదని నివేదిక స్పష్టం చేసింది.

 

పాకిస్థాన్​​లో మే 22న​ జరిగిన ఘోర విమాన ప్రమాదానికి.. కాక్​పిట్​ సిబ్బంది నిర్లక్ష్యం, ఎయిర్​ కంట్రోల్​ టవర్​ కారణమని ప్రాథమిక దర్యాప్తులో స్పష్టమైంది. విచారణ కమిటీ అందించిన సంబంధిత నివేదికను.. ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​కు సమర్పించారు విమానయాన శాఖ మంత్రి. పైలట్​, ఎయిర్​ ట్రాఫిక్ కంట్రోల్​(ఏటీసీ) అధికారులే ఈ ప్రమాదానికి బాధ్యులు అని నివేదిక స్పష్టం చేసింది.

 

నివేదికలోని విషయాలు.. 

తొలిసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించినప్పుడు విమానం వేగం, ఎత్తు రెండూ.. సూచించిన పారామితుల కంటే ఎక్కువగా ఉన్నాయి.  ఘటనా సమయంలో ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తలేదు. విమానం బ్లాక్​ బాక్స్.. ఇప్పటివరకు సాంకేతిక లోపం సంభవించే అవకాశాన్ని సూచించలేదు.

 

పైలట్​ తప్పుడు నిర్ణయం 

 

'విమానం వేగం, ఎత్తు ఎక్కువగా ఉన్నప్పటికీ ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చింది కంట్రోల్ టవర్​. ల్యాండింగ్​ గేర్​ల జామింగ్​ గురించి పైలట్.. కంట్రోల్​ టవర్‌కు సమాచారం అందించలేదు. అంతే కాకుండా రెండోసారి ల్యాండింగ్ కోసం ప్రయత్నించడం కూడా పైలట్​ తప్పుడు నిర్ణయమే.' అని నివేదిక పేర్కొంది.

 

 17 నిమిషాలు గాల్లోనే.. 

తొలిసారి ల్యాండింగ్​కు ప్రయత్నించిన తర్వాత 17 నిమిషాలు గాల్లోనే విమానం చక్కర్లు కొట్టింది. ఈ కీలక సమయంలోనే ఇంజిన్​ దెబ్బతినట్లు తెలిపింది. మే 22న లాహోర్​ నుంచి బయలుదేరి కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్​ అవ్వాల్సిన పాక్​ జాతీయ విమానం జనావాసాల్లో కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలోని ముగ్గురు చిన్నారులు సహా 97 మంది మరణించారు. ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: