భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు, మన సైనికుల మరణం నేపథ్యంలో దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా చైనా తీరుపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మన దేశంలో చూస్తే....భారత్ భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు చైనా చేస్తున్న కుట్రలపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనదేశంలో చైనాకు చెందిన ఉత్పత్తులను నిలిపివేయాలని, స్మార్ట్ ఫోన్ల నుంచి ఆ దేశానికి చెందిన యాప్లు తొలగిస్తున్నారు. అయితే, ఇదే సమయంలో భారత ప్రభుత్వం నిర్ణయం వివాదంలోకి ఎక్కింది. ఓ జాతీయ మీడియ కథనం ప్రకారం, రెండు దేశాల మధ్య సంబందాలు బలంగా ఉన్న సమయంలో భారత సైన్యం కోసం కేంద్రం రెండు లక్షల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల కోసం చైనాకు ఆర్డర్ ఇచ్చింది. మరికొన్ని రోజుల్లోనే 1.86 లక్షల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు భారత్కు రానున్నాయి. ఈ సమయంలో ఆ కాంట్రాక్టు రద్దు చేసుకోవాలని మాజీ డీఆర్డీఓ డైరెక్టర్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సరస్వత్ కోరారు.
సైనికుల కోసం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లతో పాటు, రక్షణగా ఉంచే కిట్ల తయారీ కోసం రోడ్ మ్యాప్ను సిద్ధం చేయాలని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) నీతి ఆయోగ్ను కోరింది. ఇదే సమయంలో తాజాగా భారత్ – చైనా దేశాలపై మధ్య నెలకున్న ఉద్రిక్తత పరిస్థితులపై నీతి ఆయోగ్ సభ్యుడు సరస్వత్ స్పందిస్తూ, చైనాకు బుద్ధి చెప్పేలా ఆ దేశం నుంచి మనదేశానికి దిగుమతి చేస్తున్న ఉత్పత్తులను నిలిపివేయాలని కేంద్రాన్ని కోరారు. అంతేకాదు సైన్యం కోసం చైనా నుంచి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను కొనుగోలు చేయడం ఆపేయాలన్నారు. చైనా నుంచే దిగుమతయ్యే వస్తువులే కాదు బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు సైతం నాసిరకంగా ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
సాధ్యమైనంత వరకు కేంద్రానికి తమ కమిటీ చాలా స్పష్టమైన సిఫార్సులు చేసిందని వీకే సరస్వత్ అన్నారు. ఎక్కువ శాతం సొంత ఉత్పత్తుల్ని వినియోగించుకోవాలని, అవసరమైన విదేశాలనుంచి కొనుగోలు చేయవచ్చిన అన్నారు. కానీ చైనాతో బుల్లెట్ ఫ్రూఫ్ ల విషయం కుదుర్చుకున్న ఒప్పొందాలను రద్దు చేసుకోవాలని తెలిపారు.