భారత దేశానికి ఇప్పుడు పొరుగు పోటు ఎక్కువైంది. మొదట్లో పక్కలో బల్లెంలా పొరుగున ఒక్క పాకిస్తాన్ మాత్రమే ఉండేది.. కానీ ఇప్పుడు చైనా కూడా పాక్ కు దీటుగా తయారయ్యింది. ఈ రెండు అనుకుంటే.. ఇప్పుడు కొత్తగా నేపాల్ కూడా ఇండియా అంటే కత్తులు దూస్తోంది. ఇక మరో పక్క బంగ్లాదేశ్, భూటాన్ మాత్రమే కాస్త ఏ పేచీ లేకుండా ఉన్నాయి.
అసలు నేపాల్ ఎందుకు మనపై కత్తి దూస్తోంది.. పరిపాలనలో రాచరికపు ఆనవాళ్లు కల్గిన పర్వత దేశం నేపాల్. జనాభా 2 కోట్ల 90లక్షలు. మొదటి నుంచి భారత్కు మంచి మిత్రదేశం. 2015 భూకంపం సహా అనేక సందర్భాల్లో భారత్ నుంచి సాయం పొందిన దేశం. అలాంటి నేపాల్ ఇప్పుడు భారత్కు శత్రువుగా మారుతోంది. భారత్లోని ప్రాంతాలు మావే అంటూ మ్యాప్ తయారీ చేసింది. సరిహద్దుల వద్ద భారతీయులపై దాడి చేసింది. బీహార్లో నీటిపారుదల ప్రాజక్టుల వద్ద గొడవ పడుతోంది.
నేపాల్ ఎందుకిలా వరుస దుందుడుకు చర్యలకు దిగుతోందని ఆలోచిస్తే ముందుగా కనిపించేది చైనా హస్తమే. వాస్తవాధీన రేఖ వద్ద భారత్ చేస్తున్న అభివృద్ధి పనులతో ఉడికిపోతున్న చైనా నేపాల్ను భారత్ మీదకు ఎగదోస్తోంది. లేని సమస్యలను సృష్టించడం, చిన్న వివాదాలను పెద్దవి చేయించడం వంటి చర్యల ద్వారా చైనా నేపాల్ను ఉసిగొల్పుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ ను తనకు పూర్తి అనుకూలంగా మార్చుకున్న చైనా... నేపాల్తో భారత్కు ఉన్న పాత వివాదాలను ఉపయోగించుకుని రెండు దేశాల మధ్య అగ్గి రాజేస్తోంది.
నేపాల్కు అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తూ భారత్ మీదకు చైనా ఎగదోస్తోంది. చైనాతో ఏర్పడ్డ సరిహద్దు సమస్యను పరిష్కరించుకునే చర్యల్లో ఉండగానే చిన్న దేశమైన నేపాల్ను ఉసిగొల్పుతోంది. దీని ద్వారా భారత్ను ఊపిరి సలపడకుండా చేయాలన్నదే చైనా ప్లాన్ గా కనిపిస్తోంది.