గల్వాన్ లోయలో భారత సైనికులపై దాడి పక్కా పథకం ప్రకారమే జరిగిందంటున్నాయి అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు. భారత భూభాగంలోకి చైనా దళాలు చొచ్చుకు రావడం, ఆ తర్వాత వెనక్కి తగ్గినట్లు నటించడం..  భారత దళాలను రెచ్చగొట్టేలా దాడి చేయడం.. వెనుక ఓ చైనా సీనియర్‌ అధికారి వ్యూహం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి.అయితే అదికాస్త బెడిసి కొట్టి ,  పరిస్థితి చేజారే దశకు చేరిందని విశ్లేషిస్తున్నారు. 

 

చైనా  పశ్చిమ థియేటర్‌ కమాండ్‌ హెడ్‌ జనరల్‌ ఝావో ఝాంగ్‌కీ... భారత్‌ సరిహద్దుల వెంటముందుకు వెళ్లాలని చైనా బలగాలను ఆదేశించినట్లు సమాచారం. ఆయన  పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీలో సీనియర్‌ కమాండర్‌.   కరోనావైరస్‌ వ్యాప్తి, చైనా దూకుడు కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చైనా వ్యతిరేక వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితిని వినియోగించుకుని అమెరికా భారత్‌ను తన పక్షాన చేర్చుకుంటుందని ఆయన అంచనావేశారు. 

 

దీంతో భారత్ కు గట్టి గుణపాఠం చెప్పి.. ప్రపంచవ్యాప్తంగా తన బలాన్ని చాటుకోవాలని చైనా భావించింది. కానీ... గల్వాన్‌లో బెడిసికొట్టింది. 20 మంది సైనికులు చనిపోయాక భారత్‌ దళాలు ఎదురుదాడి చేయడంతో చైనా పరువు పోయే పరిస్థితి నెలకొంది. ఈ ఘర్షణల్లో చైనా కమాండర్‌ కూడా ప్రాణాలు కోల్పోయి పరిస్థితి మొత్తం చేజారిపోయే ప్రమాదం నెలకొంది. 

 

మరోపక్క చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌కి కూడా ఈ ఘటనపై ముందస్తు సమాచారం ఉందనే అమెరికా వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఆయన సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ ఛైర్మన్‌ కావడంతో థియేటర్‌ కమాండ్‌ హెడ్‌ తీసుకొనే నిర్ణయం ఆయన దృష్టికి వచ్చే ఉంటుందని చెబుతున్నారు.

 

కమాండ్‌ స్థాయి అధికారి ఈ ఘర్షణల్లో మృతి చెందినట్లు అమెరికా వర్గాలు విశ్వసిస్తున్నాయి.  ఆ సైనికుడి అంత్యక్రియల్లో జనరల్‌ ఝావో కూడా పాల్గొన్నట్లు సమాచారం. దీంతో చైనా.. మీడియా సైట్ల నుంచి గల్వాన్‌ వార్తలను తొలగించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.. ఇదే నిజమైతే చైనాకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లే భావించాలి.

 

ఇంత పెద్ద ఘటన జరిగినా చైనా మీడియాలో పెద్దగా ప్రచారం రాకపోవడానికి ఇదే కారణమని భావిస్తున్నారు. ఈ వివాదానికి కారణమైన ఝావో చైనా సైన్యంలో చాలా సీనియర్‌ జనరల్‌. ఆయన 1979 వియత్నాం యుద్ధంలో పాల్గొన్నారు. అక్కడ చైనాకు ఎదురుదెబ్బ తగిలింది.  ఆ తర్వాత 2017లో డోక్లాం ఘటనలో ఝావో ప్రమేయం ఉంది.

 

భారత్‌ సరిహద్దుల్లో ఘర్షణల కోసం చైనా.. మే చివరి నుంచే సన్నాహాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ప్రైవేట్‌ జియో ఇంటెలిజెన్స్‌ సంస్థ హాక్‌ఐ 360 ఉపగ్రహ చిత్రాల ప్రకారం మే చివర్లో చైనా సైన్యం భారీ ఆయుధాలతో అక్కడకు చేరుకొంది. వీటిల్లో సెల్ఫ్‌ప్రొపెల్డ్‌ శతఘ్నులు కూడా ఉన్నాయి. అదే సమయంలో భారత్‌ సరిహద్దుల వెంట రోడ్ల నిర్మాణాలను ఆపేయాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టింది.

 

గల్వాన్ ఘటనతో భారత్‌లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.  ఫలితంగా చాలా చైనా ప్రాజెక్టులు అగమ్యగోచరంగా మారాయి.  బీఎస్‌ఎన్‌ఎల్‌లో చైనా పరికరాల వినియోగాన్ని తగ్గించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో డ్రాగన్‌కు కొంత ఆర్థిక నష్టం కూడా చేకూరే పరిస్థితి నెలకొంది. 

 

మరోపక్క చైనా ఏ ఉద్దేశంతో భారత్‌ను కవ్వించేందుకు ప్రయత్నించిందో అది నెరవేరలేదు. భారత్‌ అమెరికాకు మరింత దగ్గరయ్యే పరిస్థితి నెలకొంది. అమెరికా కూడా మరోపక్క దూకుడుగా భారత్‌కు మద్దతు ఇస్తోంది. ఇటీవల ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో  భారత సైనికులకు నివాళులర్పించారు. ఒక రకంగా ఇది చైనా సైనిక వ్యూహం ఫలించలేదని అమెరికా ఇంటెలిజెన్స్‌ వర్గాలు భావిస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: