ఏడాది కాలంలో ఊహించని సంక్షేమ పథకాలు అమలు చేసి, సీఎం జగన్ సంక్షేమానికి కేరాఫ్ అడ్రెస్గా మారిపోయారు. అసలు తొలిసారి సీఎం పీఠం ఎక్కి, దేశంలో ఏ సీఎం కూడా ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు అందివ్వలేదు. పైగా చెప్పిన సమయానికి చెప్పిన విధంగా ప్రజలకు పథకాలు అందించారు. ఈ విధంగా పథకాలు అందుతుండటంతో సీఎం జగన్కు ప్రజల మద్ధతు పెరిగిపోతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో కీలకంగా ఉండే కాపు సామాజికవర్గం మద్ధతు జగన్కు బాగానే పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.
అసలు రాష్ట్రంలో కాపు ఓటర్లు ఎక్కువ స్థాయిలో ఉంటారు. వారు ఎక్కువ ఏ పార్టీ వైపు ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. 2014 ఎన్నికల్లో కాపులు టీడీపీకి జై కొట్టడంతో చంద్రబాబు సీఎం అయ్యారు. పైగా అదే సామాజికవర్గానికి చెందిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీకి సపోర్ట్ చేయడం ప్లస్ అయింది. కానీ 2019 ఎన్నికల్లో కాపులు జగన్ని నమ్మారు. అందుకే జగన్ ఊహించని మెజారిటీతో అధికార పీఠంలో కూర్చున్నారు. అయితే కొన్ని ఓట్లు జనసేనకు పడ్డాయి. దీని వల్ల వైసీపీకి కొన్ని చోట్ల రావాల్సినన్ని ఓట్లు రాలేదు.
కానీ జగన్ ఎప్పుడైతే సంక్షేమ పథకాలతో రంగంలోకి దిగారో అప్పటి నుంచి పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. పవన్కు షాక్ ఇస్తూ, ఎన్నికల్లో జనసేనకు సపోర్ట్ చేసిన కొందరు కాపులు కూడా ఇప్పుడు జగన్ వైపు తిరిగేస్తున్నారు. పెన్షన్స్, అమ్మఒడి లాంటి స్కీమ్స్ జగన్కు ప్లస్ అయ్యాయి.
ఇక తాజాగా కాపు మహిళల కోసం ప్రత్యేకంగా కాపు నేస్తం పథకం తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా అర్హులైన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన 45-60 వయసున్న మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏటా రూ. 15 వేల చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ. 75 వేల ఆర్ధిక సహాయం అందించనుంది. అయితే ఈ పథకంతో మెజారిటీ కాపులు జగన్కు జై కొడుతున్నారు. ఎన్నికల్లో ఓట్లు వేయని వారు సైతం ఇప్పుడు, జగన్ వైపుకు వచ్చేస్తున్నారు.