దేశవ్యాప్తంగా కరోనా కలకలం కొనసాగుతోంది. అన్ని వర్గాలు ఈ మహమ్మారితో బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి తరుణంలో నాయకులు ప్రజల్లో ధైర్యం నింపాలి. సహాయక చర్యలు చేపట్టాలి. విధానపరమైన నిర్ణయాల్లో ప్రజా సంక్షేమం చూడాలి. కానీ కొందరు నేతలు అలా వ్యవహరించడం లేదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్నే చర్చ జరుగుతోంది. సీనియర్లు-జూనియర్లు, ప్రముఖులు- ఎదుగుతున్న నేతలు అనే తేడా లేకుండా అంతా అంతే అన్నట్లుగా మాట్లాడుతున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ చర్చ ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ చికిత్స విషయంలో కేంద్రానికి, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చిచ్చు చెలరేగుతోంది. ప్రతి కోవిడ్ పేషెంట్ క్లినికల్ పరీక్ష కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా .. ఢిల్లీ ప్రభుత్వానికి లేఖ రాయగా దీన్ని ఢిల్లీ సర్కారు వ్యతిరేకిస్తోంది. గతంలో ఇదే అంశంపై గవర్నర్ బైజాల్తోనూ వివాదం నెలకొన్నట్లు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా తెలిపారు. కోవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తి కచ్చితంగా అయిదు రోజుల పాటు ఇన్స్టిట్యూషన్ క్వారెంటైన్ కావాలని గవర్నర్ బైజాల్ ఆదేశించారు. ఆ ఆదేశాలను కూడా ఢిల్లీ సర్కార్ తిరస్కరించింది. ``హాస్పిటళ్లలో సరిపోను వసతులు లేవు అని, ఇప్పుడు ఇది షా మోడలా లేక కేజ్రీవాల్ మోడల్ అన్నది విషయం కాదు` అని డిప్యూటీ సీఎం సిసోడియా తెలిపారు. కొత్త పద్ధతి వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపిన డిప్యూటీ సీఎం ఆ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, దేశ రాజధానిలో ఓ వైపు కేసకులు పెరుగుతుంటే...మరోవైపు ఇదేం రాజకీయ పంచాయతీ అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైని కలిగిన మహారాష్ట్రలో నేతలది మరో తీరు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ పై భారతీయ జనతా పార్టీ నాయకుడు గోపీచంద్ పడల్కర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శరద్ పవార్ ను కరోనా వైరస్ తో పోల్చారు. శరద్ పవార్ మహారాష్ర్టకు పట్టిన కరోనా వైరస్ తప్ప మరొకటి కాదన్నారు. ``గత కొన్నేళ్లుగా పవార్ మహారాష్ర్టకు నాయకత్వం వహిస్తున్నారు. కానీ ప్రజలకు చేసిందేమీ లేదు. ప్రజలను ఎల్లప్పుడూ దుర్భషలాడటమే ఆయనకు తెలుసు. ఎలాంటి ఎజెండా లేని పవార్ కు ప్రజలను ఎలా మోసం చేయాలో మాత్రమే తెలుసు`` అంటూ రాజకీయాలను చొప్పించారు.