ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు అభూత కల్పన సృష్టిస్తున్నారు. ఇక సోషల్ మాద్యమాల్లో వస్తున్న పోస్ట్ విషయాల్లో ఏది నిజమో.. ఏది అబద్దమో తెలియని పరిస్థితి. ముఖ్యంగా ఫేస్ బుక్ విషయంలో దారుణాలు మరీ ఎక్కువ. ఎవరి ప్రొఫైల్ నిజమైనదో అస్సలు అర్థం కాని పరిస్థితి. ఇలా దొంగ ప్రొఫైల్స్.. దొంగ కాంటాక్ట్ లతో ఎంతో మంది మోసపోయారు.. పోతూనే ఉన్నారు. సోషల్ మీడియాలో పరిచయం పెంచుకున్న చీట్ చేస్తూనే ఉన్నారు సైబర్ నేరగాళ్లు... తాజాగా హైదరాబాద్ పోలీసులకు పలు ఫిర్యాదులు అందాయి. ఓ మహిళ హైదరాబాద్ యువకుడికి ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది... ఆ తర్వాత కొంత కాలానికి ఐ లవ్ యూ చెప్పి.. తన ట్రాక్లోకి దింపుకుంది. అందమైన ప్రొఫైల్ చూసి మనోడు ఊరికే బుట్టలో పడిపోయాడు.
ఇక తాను ఓ అందమైన అమ్మాయిని లైన్లో పెట్టానని.. ఆమెతో చాటింగ్ ప్రారంభించానని ఫ్రెండ్స్ తో గర్వంగా చెప్పకున్నాడు. ఇలా ప్రతిరోజూ ఫేస్ బుక్ చాట్ లో చాట్ చేస్తూ వచ్చారు. ఇక, ఈ నెల 17న తన ప్రేమకు గుర్తుగా గిఫ్ట్ పంపిస్తున్నానని.. అందులో ఓ ల్యాప్ టాప్, యూకే ఫోన్లు, కరెన్సీ, గోల్డ్, ఖరీదైన వాచ్... తన తొలి గిఫ్ట్ అంటూ వాట్సాప్ మెసేజ్ పెట్టింది కిలాడి లేడీ.
ఆ తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి మాట్లాడుతున్నామని.. సదరు యువకుడికి ఫోన్ చేసింది ఆ మహిళ... మీకు ఓ ఖరీదైన పార్సిల్ వచ్చిందని అది లక్షల్లో ఉందని.. వాటికి కస్టమ్స్, ఎక్సైజ్, ఐటీ టాక్స్ పే చేయాల్సి ఉంటుందని ఆన్ లైన్ ద్వారా లక్ష రూపాయల వరకు నొక్కేసింది.. ఆ తర్వాత పార్సిల్ లేదు ఏమీ లేదని గ్రహించిన యువకుడు తాను ఘోరంగా మోసపోయానని గమనించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు.