దేశాన్ని నడిపించాలంటే ప్రభుత్వానికి ఆదాయం రావాలి, దీని కోసం ప్రజలపై పన్నులు విధించాలి. అవి హేతుబద్ధంగా, సామాన్యుడు భరించగలిగేలా ఉండాలి. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా.. దేశ ప్రజలపై ఏమిటీ పెనుభారం. ఏ వ్యాపారంలోనైనా లాభం ప్రాథమిక సూత్రం. వ్యాపార సంస్థలు లాభం ఆధారంగానే క్రయవిక్రయాలు జరుపుతూ ఉంటాయి. ముడి చమురును ఉత్పత్తి చేసే సంస్థలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. భారతదేశ పెట్రో ఉత్పత్తుల అవసరాలకు సుమారు 70 శాతం విదేశాల నుంచి వచ్చే దిగుమతులే ఆధారం.
అయితే అంతర్జాతీయ కంపెనీలు, దేశీయ చమురు కంపెనీలకు అమ్ముతున్న ధరకు, ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న ధరల మధ్య తేడాను చూస్తే అది భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా తగ్గినా భారత్లో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ ధరల్లో తగ్గుదల సామాన్యుడికి ఏ మాత్రం బదిలీ కావడంలేదు.
లాక్డౌన్ సడలింపులు తరువాత కేంద్ర ప్రభుత్వం జూన్ 7 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం ఆరంభించగా దేశ చరిత్రలోనే తొలిసారిగా వరుసగా 18వ రోజూ వాటి ధరలు పెరిగాయి. ఇక దేశ రాజధాని దిల్లీలో డీజిల్ ధర పెట్రోల్ ధరను దాటిపోవడం సామాన్యుడు మోస్తున్న పెనుభారానికి అద్దం పడుతోంది.
వ్యక్తిగత వాహనం సామాన్యుడికి దాదాపు నిత్యావసరం. బస్సులు రైళ్లు, క్యాబ్లు, ట్యాక్సీలు అందుబాటులో ఉన్నప్పటికీ దేశంలోని అనేక మంది సొంతవాహనానికే మొగ్గు చూపుతారు. ఈ బండి బయటకు తీస్తేనే బతుకు అనే బండి నడిచేది. అయితే లాక్డౌన్ సడలింపులు తర్వాత 18రోజుల నుంచి వరుసగా ప్రతిరోజు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఇక బండి బయటకు తీయాలంటే ఒకటికి రెండుసార్లు
దేశీయ చమురు కంపెనీలు జూన్ 7న పెట్రోల్, డీజీల్ ధరలను సవరిస్తామని ప్రకటించి, ఆ రోజు నుంచి పెంపు ప్రారంభించగా ఈ 18 రోజుల్లో కలిపి పెట్రోల్ ధర లీటరుకు రూ.9.41 పైసలు, లీటర్ డీజీల్ ధర రూ.9.58 పైసలు పెరిగింది. ఈ స్వల్ప వ్యవధిలో ఈ స్థాయిలో పెంపు ఉండటం ఇదే తొలిసారి.
దేశ రాజదాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.79.76 పైసలు ఉండగా, డీజిల్ ధర రూ.79.88 పైసలకు చేరుకుంది. తొలిసారిగా డీజిల్ ధర, పెట్రోల్ ధరలను మించిపోయాయి. పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదల వెనుక కారణాలు తరచి చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే అధిక పన్నులు, డీలర్ల కమిషన్ లే కారణం.