టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వాడుకలోకి కొత్త వస్తువులు వస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో నేటి తరానికి పరిచయం అక్కర్లేని పేరు వాట్సాప్. మెసేజులు పంపడానికి, వాయిస్, వీడియో కాల్స్ చేయడానికి, ఫోటోలు, డాక్యుమెంట్లు షేర్ చేసుకోవడానికి ఈ యాప్ ను విపరీతంగా వాడుతున్నారు. స్మార్ట్ఫోన్ కొనే చాలామంది మొదట ఇన్స్టాల్ చేసే యాప్ వాట్సప్ అంటే అతిశయోక్తి కాదు. అంతలా ఈ మెసేజింగ్ యాప్ జీవితాలతో పెనేసుకుపోయింది. టెక్నాలజీ ఎంత పెరిగిందో సైబర్ నేరగాళ్ల ఆగడాలు కూడా అంతే పెరిగాయి.
అయితే తాజాగా సైబర్ నేరగాళ్లు వాట్సప్ను ఉపయోగించుకునీ సరికొత్త మోసాలకు దారి తీస్తున్నారు. అయితే ఇప్పటికే వీరి బారినపడిన పలువురు లబోదిబోమంటున్నారు. అచ్చం వాట్సాప్ సంస్థ నుంచి వచ్చినట్లే సందేశం పంపిస్తున్నారు కొందరు. అయితే వారు తమను తాము సంస్థ సాంకేతిక బృందంగా పేర్కొంటారు. ప్రొఫైల్ పిక్లోనూ ఆ సంస్థ అధికారిక లోగో మాదిరిదే ఉంచుతారు. మీ వాట్సప్ నంబర్కు వచ్చిన ఆరంకెల పరిశీలన రహస్య సంఖ్యను తమకు పంపించాలని తెలియజేస్తున్నారు. వారిని నమ్మి పొరపాటున ఆ సంఖ్యను పంపించారో ఇక మీ పని అంతే.
నేరగాళ్లు పిన్ నంబర్ ఉపయోగించుకుని మీ వాట్సప్ నంబర్తో వారి ఫోన్ కంప్యూటర్లో లాగిన్ అవుతారని తెలిపారు. వెంటనే మీ వాట్సప్ పూర్తిగా వారి ఆధీనంలోకి వెళ్లిపోతుందన్నారు. వాట్సప్ ఖాతా డీయాక్టివేట్ అయిపోతుంది. అంతకుముందే కొన్ని మోసపూరిత లింక్లను పంపించి... మీ ఫోన్ను సైతం హ్యాక్ చేస్తారన్నారు. క్రెడిట్, డెబిట్ కార్డుల పాస్వర్డ్లను, వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తారని తెలిపారు.
పిన్ నంబర్లు, ఇతర వ్యక్తిగత సమాచారం కోరుతూ వచ్చే సందేశాలకు స్పందించొద్దని తెలియజేశారు. వెరిఫికేషన్ పిన్ను ఇప్పటికే ఎవరికైనా పంపించి ఉంటే మీ ఖాతాను వెంటనే రీవెరిఫై చేయించుకోవాలన్నారు. ఎవరైనా మోసపోయినా పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలియజేశారు. వాట్సప్లో కొత్తగా వచ్చిన రెండంచెల వెరిఫికేషన్ విధానాన్ని వినియోగించుకోవాలని తెలియజేశారు.