కొందరి నుంచి కొన్ని ఆశించలేం. ఆశించడం వల్ల ప్రయోజనం ఉండదు కూడా. అలాంటి జాబితాలో పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ను చేర్చవచ్చు. ఉగ్రదాడులతో అమెరికాపై విరుచుకుపడి ప్రపంచాన్ని గడగడలాడించిన కరడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ మీకు గుర్గున్నాడు కదా? ఎందుకు గుర్తుండడు అంటారా? అలా మనకు గుర్తున్న ఉగ్రవాది బిన్ లాడెన్ అమరవీరుడు అంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీర్తించారు.
సాక్షాత్తు పాకిస్తాన్ పార్లమెంట్లో ప్రసంగిస్తూ ఇమ్రాన్ ఖాన్ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రత్యేక బలగాలు 2011లో అబోటాబాద్లో లాడెన్ను హతమార్చిన తర్వాత ఆ దేశంతో పాకిస్థాన్ సంబంధాలు ఎలా దిగజారాయో చెప్పే క్రమంలో ఇమ్రాన్ ఖాన్ లాడెన్ను అమరవీరునిగా సంబోధించారు. అమెరికన్లు అబోటాబాద్ వచ్చి లాడెన్ను చంపేశారు. ఆయన్ను అమరవీరుణ్ని చేశారని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యల పై పాకిస్థాన్ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రతిపక్ష నేతలు ఇమ్రాన్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఉగ్రవాద ఘటనలతో ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలపై వివక్ష కొనసాగుతున్న వేళ ఓ ఉగ్రవాదిని అమరుడిగా కీర్తించడం ద్వారా ఇమ్రాన్ వారిని మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టారని విపక్ష నేతలు మండిపడుతున్నారు. తాను ఓ దేశ ప్రధానినని, తాను మాట్లాడుతోంది ప్రపంచమంతా ఉగ్రవాదిగా గుర్తించిన లాడెన్ గురించి అన్న స్పృహ లేకుండా ఆయన్ను అమరవీరుడిగా కీర్తించారని విరుచుకుపడుతున్నారు.
మరోవైపు పాక్ విషయంలోనూ అమెరికాకు అప్పట్లో గట్టి షాకే తగిలింది. అనేక దేశాల్లో ఆల్ ఖైదా ఉగ్ర విధ్వంసానికి సూత్రధారి అయిన లాడెన్ను యావత్ ప్రపంచం ఉగ్రవాదిగానే గుర్తించింది. 2011లో పాకిస్థాన్కు ఏ మాత్రం సమాచారమివ్వకుండా సొంత ఆపరేషన్ తో అబోటాబాద్లో లాడెన్ను అమెరికా బలగాలు హతమార్చినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆయన మరణంపై ఏ దేశం కూడా లేదా పార్టీ కూడా సానుభూతి వ్యక్తం చేయలేదు.