రాష్ట్రంలో ప్రతి రోజూ వెయ్యికి దగ్గరగా జీహెచ్ ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతుండటంతో లాక్డౌన్ విధించేందుకు కూడా సిద్ధమే అని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్లో 15 రోజుల పాటు లాక్డౌన్ విధించాలని వైద్య, ఆరోగ్య శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందడంతో అప్పటి నుంచే లాక్డౌన్ అమల్లోకి తీసుకువస్తే ఎలా ఉండటుందన్న దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. పరిస్థితి అదుపులోకి వచ్చేట్లుగా లేకపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరోసారి లాక్డౌన్ విధించడానికే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తేటతెల్లమైంది.
మూడు రోజుల క్రితం తనను కలసిన ఉన్నతాధికారులతో సైతం అవసరమైతే హైదరాబాద్లో మళ్లీ లాక్డౌన్ విధించనన్నుట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. లాక్డౌన్ అనేది చాలా పెద్ద విషయమని.. దీనిపై ప్రభుత్వ యంత్రాగాన్ని సన్నద్ధం చేయాల్సి ఉంటుందని సీఎం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ చాలా పెద్ద నగరమని.. ఇక్కడ కోటి మంది నివసిస్తున్నారని మిగతా నగరాల్లో మాదిరిగానే ఇక్కడా కరోనా వ్యాప్తి చెందుతోందని పేర్కొన్నారట. కరోనా పెరగడంతో చెన్నైలో మరోసారి లాక్డౌన్ విధించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. జీహెచ్ఎంసీ పరిధిలో లాక్డౌన్కు సంబంధించి రెండు, మూడు రోజుల్లో కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. కాగా, ఈ సారి లాక్డౌన్ విధిస్తే.. కఠిన అంక్షలు అమలు చేయనున్నట్టుగా సమచారం.
ఇదిలా ఉండగా ఆదివారం మీడియాకు తెలిపిన విధంగా లాక్డౌన్పై స్పష్టమైన ప్రకటన చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం..వచ్చేనెల 1 నుంచి 15రోజుల పాటు జీహెచ్ ఎంసీ పరిధిలో పూర్తి లాక్డౌన్ కొనసాగుతుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు సాయంత్రం ప్రెస్మీట్లో వెల్లడించనున్నట్లు కూడా సమాచారం అందుతోంది. అత్యవసర సేవలకు..నిత్యావసరాల కొనుగోలుకు ఆంక్షలతో కూడిన అనుమతులను మంజూరు చేసే విధంగా లాక్డౌన్ నిబంధనలకు రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది.