ఎవ‌రైనా మంచి ప‌ని చేస్తే అభినందించాల్సిందే. క‌ష్టాల్లో ఉన్న వారి గురించి పెద్ద మ‌న‌సుతో స్పందిస్తే, స‌మ‌స్య ప‌రిష్కారానికి ప్ర‌య‌త్నిస్తే, వారిని గుర్తించాల్సిందే. క‌రోనా కల‌క‌లం అన్ని రంగాల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేస్తోంది. కొంద‌రు ఎంతో ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. ప్ర‌భుత్వాలు వారిని కొంత ఆదుకుంటున్నాయి కూడా. ఇలా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ఇప్ప‌టికే వివిధ వ‌ర్గాల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించే ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్నారు. అయితే, తాజాగా ఆయ‌న ముందు సినీ న‌టుడు, జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క ప్ర‌తిపాద‌న పెట్టారు. విద్యాబుద్ధులు నేర్పే గురువును దైవంతో సమానంగా చూసే సంస్కృతి మనదని, వారి క‌ష్టాల‌ను తీర్చాల‌ని ప‌వ‌న్ కోరారు.

 


కరోనా విపత్తు వల్ల ప్రైవేట్ యాజమాన్యంలోని పాఠశాలలు, కళాశాలల్లో పని చేస్తున్న బోధన సిబ్బందిపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని తాజాగా ఓ ప్ర‌క‌ట‌న‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ``గత నాలుగు నెలలుగా జీతాలు అందకపోవడం వల్ల ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఓనమాలు నేర్పే గురువులు నడిరోడ్డున నిలవాల్సి రావడం బాధాకరం. జీతాలు లేకపోవడంతో కొందరు ఉపాధ్యాయులు రోడ్డుపై బండ్ల మీద పళ్ళు, కూరగాయలు అమ్ముకొంటున్నారని వివిధ ప్ర‌సార‌ మాధ్యమాల ద్వారా తెలిసింది. కరోనా సమయంలో ఆర్థికపరమైన ఒడిదొడుకులు వస్తున్నాయి. చిన్నపాటి ప్రైవేట్ పాఠశాలలకు అలాంటి ఇక్కట్లు, వనరులు సమకూర్చుకోవడంలో సమస్యలు ఎదురవుతున్నాయని తెలిసింది. అయితే ఎన్నో ఏళ్లుగా ఈ రంగంలో నిలదొక్కుకొని ఉన్న కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా సిబ్బందికి వేతనాలు చెల్లించకపోవడం ఆశ్చర్యకరం`` అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

 

ఎందరో భవిష్యత్ ను తీర్చిదిద్దే స్థానంలో ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు ప్రైవేట్ రంగంలో పని చేయడం వల్ల ఏడాదిలో పది నెలల జీతం మాత్రమే వస్తోందని, ఈ యేడాది కరోనా వల్ల అది కూడా లేకుండాపోయిందని సంబంధిత సంఘాల ప్రతినిధులు జనసేన పార్టీకి వినతి పత్రం అందజేశారని ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేర్కొన్నారు. ``ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో 5 లక్షల మందికిపైగా బోధన సిబ్బంది ఉన్నారు. ఆయా విద్యా సంస్థలు యేడాది ఫీజులు వసూలు చేసినా తమకు మాత్రం కరోనా పేరుతో గత నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కుటుంబం గడవటం ఇబ్బందికరంగా మారిందనీ, బోధన వృత్తి నుంచి హాకర్లుగా, రోజు కూలీలుగా మారుతున్నారని వాపోయారు. ఆన్ లైన్ క్లాసులు ఏర్పాటు చేసి విద్యార్థుల నుంచి రుసుములు తీసుకొంటున్న సంస్థలు తమ సిబ్బందిని తగ్గించేస్తున్నాయనే విషయం పార్టీ దృష్టికి వచ్చింది. లక్షల్లో ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకుల కష్టాలను రాష్ట్ర విద్యాశాఖ పరిగణనలోకి తీసుకోవాలి. ప్రైవేట్ పాఠశాలలో ఉద్యోగాలు చేస్తున్నవారిని ప్రభుత్వం గుర్తించి తక్షణ ఉపశమనం కోసం ఆర్థిక సాయం అందించాలి. తమకు పి.ఎఫ్., ఈ.ఎస్.ఐ. కల్పించాలని ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ యూనియన్ కోరుతోంది. వీటిని కల్పించడంపై దృష్టిపెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. బతక లేక బడిపంతులు అనే గత కాలపు మాటను వర్తమానంలో నిజం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనా, విద్యాసంస్థల నిర్వాహకులపైనా ఉంది.`` అని పవన్ కల్యాణ్  లేఖ‌లో కోరారు. జనసేన అధ్యక్షుడు చేసిన ఈ ప్ర‌తిపాద‌న‌పై ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: