గత కొద్దికాలంగా తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు, దీనిపై రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ సర్కారు, కేంద్రంలో పరిపాలిస్తున్న బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఓ దశలో వివిధ ప్రభుత్వ విభాగాలకు తెలంగాణ బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా, తాజాగా భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన బృందం తెలంగాణలో పర్యటించింది. ఈ బృందం పర్యటనపై అందరి చూపు పడగా తాజాగా తెలంగాణ సర్కారుకు పెద్ద రిలీఫే దక్కింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం గచ్చిబౌలీలోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS), గాంధీ ఆసుపత్రి, దోమల్ గూడాలోని దోభీ గల్లీ (కంటెన్మెంట్ ఏరియాను) సందర్శించి క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరీశిలించింది. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీనియర్ ఆధికారులతో సమావేశమై కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకోవాలసిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ మేనేజ్ మెంట్ పై వైద్య శాఖ అధికారులు సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో సర్వైలెన్స్, కంటైన్మెంట్ చర్యలు, ఆసుపత్రుల సన్నద్దత, వైద్య సంరక్షణ పరికరాల సమీకరణ, వైరెస్ నివారణ చర్యల పై కేంద్ర బృందానికి వివరించారు. రాష్ట్రంలో 17081 బెడ్లు ఉన్నాయని, మరింత మెరుగైన చికిత్స కోసం 4489 అదనపు సిబ్బందిని రిక్రూట్ చేసామని తెలిపారు. వైద్య మౌలిక సదుపాయలు మెరుగుపరచడం కోసం రూ.475.74 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.
కాగా, కేంద్ర బృందం రాష్ట్రంలోని ఆసుపత్రుల నిర్వహణ పై సంతృప్తి వ్యక్తం చేసింది మరియు ఇతర రాష్ట్రాల క్షేత్ర స్థాయి పర్యటనల అనుభవాన్ని పంచుకుంది. కేంద్ర బృందం రాష్ట్రంలో కరోనా నియత్రణ చర్యలు , వైద్య పరీక్షల సామర్ధ్యం పెంచడం , కాంటాక్ట్ ట్రేసింగ్ మరియు క్లినికల్ మెనేజ్ మెంట్ పై సూచనలు చేసింది. కేసులు పెరుగుతున్న నేపధ్యంలో వచ్చే రెండు నెలలో చేపట్టవలసిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలన్నారు.