కరోనా కలకలం కొనసాగుతున్న హైదరాబాద్ విషయంలో కీలక నిర్ణయానికి ముహుర్తం రెడీ అయిపోయింది. పెద్ద ఎత్తున కేసుల నమోదు, వివిధ ప్రాంతాల్లో స్వచ్ఛంద లాక్ డౌన్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ప్రభుత్వమే హైదరాబాద్లో మరో సారి లాక్డౌన్ విధించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరో మూడు నాలుగు రోజుల్లో దానికి సంబందించిన నిర్ణయం తీసుకుంటామని నిన్న సీఎం కార్యాలయం నుంచి సమాచారం వచ్చింది. దానికి కొనసాగింపుగా సోమవారం మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ హైదరాబాద్ లో లాక్ డౌన్ విధించే విషయం మీద కూలంకుషంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా, స్వయానా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు లాక్ డౌన్ ఆలోచన చేసినట్లు సమాచారం. ఈ మేరకు రేపు కేబినెట్ సమావేశం ఉండనున్నట్లు తెలుస్తోంది.
జిహెచ్ఎంసి పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. జిహెచ్ఎంసి పరిధిలో కొద్ది రోజుల పాటు తిరిగి లాక్ డౌన్ విధాంచాలనే ప్రతిపాదనలపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సిఎం చెప్పారు. ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చినంత మాత్రాన భయాందోళనకు గురి కావాల్సిన అవసరం ఏమీలేదని, అందరికీ సరైన వైద్యం అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. దీని ప్రకారం ఇప్పటికే స్పస్టమైన హింట్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే, లాక్ డౌన్ విధించాలనే ఆలోచన అంటున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, బుధవారం కేబినెట్ సమావేశం జరగనుంది. వీలైతే అదే రోజుల లేదంటే జూలై 2న తెలంగాణ కేసీఆర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రకటించే అవకాశం ఉంది. లాక్ డౌన్ అమలు మీద అధికారిక ప్రకటన కేసీఆర్ ప్రెస్ మీట్ లోనే వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాగా,హైదరాబాద్లో లాక్ డౌన్ జూలై మూడు నుండి మొదలవ్వచ్చని, పదిహేను రోజుల పాటు లాక్ డౌన్ విధించనున్నారని అంటున్నారు. అయితే ఈసారి మునుపటి కంటే కఠినంగా లాక్ డౌన్ అమలు చేసేలా ప్రభుత్వ యంత్రాంగం సిద్దం అవ్వమని ఆదేశాలు అందినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార వర్గాలు తగు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.