ప్రస్తుతం కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చైనాలో పుట్టుకొచ్చిన ఈ కరోనా భూతం దేశదేశాలను తన గుప్పెట్లో పెట్టుకుని.. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక రోజుల తరబడి లాక్డౌన్ను అమలు చేస్తున్నా.. కరోనా వైరస్ తీవ్రతలో ఎలాంటి మార్పూ కనిపించకపోగా.. రోజురోజుకు మరింత తీవ్రంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 10,285,127కి చేరుకున్నాయి. మరియు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య అయిదు లక్షల మార్క్ను దాటేసింది.
ప్రస్తుతం ఈ లెక్కలు చూస్తుంటే పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ పక్కన పెడితే.. ఇంతకాలం దొంగ సొమ్ముకే బినామీలను చూస్తున్నాం. ఇపుడు కరోనా టెస్టులకు కూడా బినామీలను వాడుకుంటున్నారట. వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం అంటున్నారు కొందరు. సాధారణంగా బినామీల పేరుతో ఆస్తులు పోగేసుకునేవారు ఎందరో ఉన్నారు. అందులోనూ ముఖ్యంగా రాజకీయనాయకులు, పారిశ్రామకవేత్తలే ఎక్కువగా బినామీలను పెడుతుంటారు. ప్రస్తుతం ఏ పార్టీలో వారైనా ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వేచ్చగా బయట తిరిగేస్తున్నారు. ఇక వ్యాపార కలయికలు డీల్స్ మామూలే. దీనిని బట్టీ.. సామాన్యులతో పోలిస్తే.. పెద్దవాళ్లే ఎక్కువ బయట తిరుగుతున్నారు. ఈ క్రమంలో కరోనా మహమ్మారి ప్రజాప్రతినిధులను వదలడం లేదు.
ఇప్పటికే ఈ మహమ్మారి కాటుకు దేశంలో పలువురు ప్రజా ప్రతినిధులు మరణించారు. మరికొంత మంది ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో ఎందుకైనా మంచిదని బయట తిరుగుతున్న బడా నేతలు, వ్యాపారులు, అనుమానాలున్న వారు టెస్టులు చేయించుకుంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే.. ఇలాంటి వారిలో కొందరు బయటపడటం ఎందుకని... టెస్టు చేశాక పాజిటివ్ వస్తే సైలెంటుగా ఫాం హౌస్లో చికిత్స తీసుకుందాం.. రాకపోతే బిందాస్ అని అనుకుంటున్నారట. ఈ క్రమంలోనే సదరు నేతలు తమ పనివాళ్ల పేరు మీద తమ నమూనాలు చెక్ చేయించుకుంటున్నారట. అంటే బినామీ పేర్లతో కరోనా టెస్టులు చేయించుకోవడం అన్నమాట. ఏదేమైనా కరోనా విషయంలోనూ అతి తెలివిని బాగానే ప్రదర్శిస్తున్నారు.