చైనా ఉత్పత్తుల దిగుమతులను తగ్గించడానికి కొంచం సమయం పడుతుందని కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ అప్లయెన్సెస్‌ తయారీ సంస్థల సమాఖ్య సీఈఏఎంఏ తెలిపారు. చైనా ఉత్పత్తులను బాయ్‌కాట్‌ చేయాలన్న ఉద్యమం ఊపందుకోవడానికి ముందునుంచే కంపెనీలు దీనిపై దృష్టి పెట్టాయని సీఈఏఎంఏ ప్రెసిడెంట్‌ కమల్‌ నంది పేర్కొన్నారు.

 

 

దేశీయంగా ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ వీటిని అభివృద్ధి చేసుకునేందుకు కనీసం రెండేళ్లయినా పట్టే అవకాశం ఉందని అంచనా వేసి వివరించారు. ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ప్రభుత్వం కూడా దశలవారీ తయారీ పథకం వంటి స్కీములతో తయారీ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తోందని కమల్‌ చెప్పారు. దీనిపై ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.

 

 

బాయ్‌కాట్‌ చైనా ఉద్యమంతో చైనాయేతర కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతోందని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా బిజినెస్‌ హెడ్‌ అద్వైత్‌ వైద్య తెలిపారు. ‘గడిచిన కొద్ది రోజులుగా మొబైల్‌ ఫోన్లకు గతంలో ఎన్నడూ లేని విధంగా డిమాండ్‌ ఏర్పడిందన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో వివిధ ధరల శ్రేణిలో కొత్తగా ఆరు హ్యాండ్‌సెట్స్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తున్నామన్నారు.

 

 

అలాగే భారత్‌లో మా ఉత్పత్తి సామర్థ్యాన్నీ పెంచుకుంటున్నాం. మా మేకిన్‌ ఇండియా ఉత్పత్తుల గురించి భారీ ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నాం‘ అని ఆయన వివరించారు. ఇక వంటగది ఉపకరణాల తయారీ సంస్థ టీటీకే ప్రెస్టీజ్‌ తాము చైనా నుంచి కొనుగోళ్లను నిలిపివేయనున్నట్లు తెలియజేశారు.

 

 

డోక్లాం ఉదంతం జరిగినప్పట్నుంచీ గడిచిన కొన్నాళ్లుగా మేం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాం. ప్రస్తుతం సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా నుంచి దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించుకున్నాం‘ అని సంస్థ ఎండీ చంద్రు కల్రో తెలియజేశారు.

 

 

భారత మార్కెట్‌ అవసరాల కోసం టీటీకే ప్రెస్టీజ్‌ దిగుమతి చేసుకునే వాటిల్లో చైనా వాటా సుమారు 10 శాతం ఉంటోంది. విదేశాల నుంచి దిగుమతులను 5 శాతానికన్నా తక్కువకే పరిమితం చేసుకోవాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రుతెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: